రజనీకాంత్ ఇంటికి బీజేపీ నేతలు..! తమిళనాట కీలక పరిణామాలు..!
తమిళనాడులో తాజా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విజయ్ పార్టీ పెట్టిన 27 నెలల్లోనే సీఎం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth).. ఈ మధ్య తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు. మరోవైపు అన్నామలై రాజీనామా తర్వాత మరింత బలహీనపడిన బీజేపీ.. ఇప్పుడు రజనీకాంత్ వైపు చూస్తోంది. రజనీని ముందు పెట్టి తమిళనాడులో అధికారం అందుకోవాలని ఎదురుచూస్తున్న బీజేపీ (Bjp) నేతలు ఇవాళ ఆయన్ను ఇంటికి వెళ్లి కలిశారు.
చెన్నైలో తమిళనాడు బీజేపీ నాయకత్వంతో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. నటుడి నివాసంలో రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, జాతీయ కార్యదర్శి డాక్టర్ అరవింద్ మీనన్ ఆయనను కలిశారు. ఈ సమావేశం సందర్భంగా గత 12 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ మరియు పాలనాపరమైన కార్యక్రమాలను వివరించే ప్రచురణలను ఆ నాయకులు ఆయనకు అందించినట్లు బీజేపీ నేతలు తెలిపారు.

అయితే లోగుట్టు వేరేగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన విజయ్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం అయ్యేందుకు డీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ అది అంత సులువుగా కనిపించడం లేదు. మరోవైపు అన్నాడీఎంకే సరైన నాయకత్వ లేమితో రోజురోజుకూ బలహీనపడుతోంది. ఇలాంటి పరిస్దితుల్లో రజనీకాంత్ ను తమ పార్టీలోకి తెచ్చి సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే ఫలితం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో రజనీకాంత్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయంలో గతంలో చెప్పిన మాటలకు రజనీ కట్టుబడి ఉంటారా లేదా అనేది తెలియడం లేదు. బీజేపీ అగ్రనాయకత్వం కోరితే మాత్రం రజనీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications