కమలంతో కబాలి దోస్తీ : యాక్టివ్ పాలిటిక్స్లో సూపర్స్టార్ రజినీకాంత్..ఎన్నికలకు ఏడాది ముందే..!
చెన్నై: దక్షిణాది సూపర్స్టార్ రజినీకాంత్.. ఇక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారా? వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? దీనికోసం భారతీయ జనతా పార్టీతో సీట్లను సర్దుబాటు చేసుకుంటారా?.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. దీనికి కారణం- రజినీకాంత్ హఠాత్తుగా తన పార్టీ రజినీ మక్కళ్ మండ్రం (ఆర్ఎంఎం) చెందిన జిల్లాస్థాయి కార్యదర్శకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడమే. ఈ భేటీ కాస్త తమిళనాడు రాజకీయాలను హీటెక్కించాయి.
హఠాత్తుగా పార్టీ జిల్లా స్థాయి కార్యదర్శులతో భేటీ..
రజినీకాంత్ తెర మీదే కాదు.. తెర వెనక కూడా ఏం చేసిన సంచలనమే అన్నట్టుగా మారింది తమిళనాడు రాజకీయాలు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఆయన జిల్లా స్థాయి కార్యదర్శులతో భేటీ అయ్యారు. చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో ఈ సమావేశం ఏర్పాటైంది. సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. తమిళనాడు నుంచి అన్ని జిల్లాల కార్యదర్శులు, కొందరు ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి రజినీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ప్రెస్ మీట్ ఉంటుందని ఆశించినా..
ఈ భేటీ అనంతరం రజినీకాంత్ విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారంటూ మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. అనంతరం దాన్ని రద్దు చేసినట్లు పార్టీ కార్యాలయం నుంచి మీడియా ప్రతినిధుల ఫోన్లకు మెసేజీలు వెళ్లాయి. భేటీ ముగిసిన తరువాత రజినీకాంత్ తన కారులో నేరుగా పోయెస్ గార్డెన్స్కు బయలుదేరి వెళ్లారు. విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు. పోయెస్ గార్డెన్స్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో వేచి ఉండటంతో ఆయన వారిని నిరాశపర్చలేదు. క్లుప్తంగా మాట్లాడారు.
కొన్ని అంశాలపై ఆరా..
జిల్లా స్థాయి కార్యదర్శులతో నిర్వహించిన సమావేశానికి రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చిన రజినీకాంత్.. చివరిలో ఓ ట్విస్ట్ ఇచ్చి వదిలేశారు. ఆ ట్విస్టే ఉత్కంఠతకు దారి తీసింది. కొన్ని అంశాలను తెలుసుకోవడానికి మాత్రమే తాను జిల్లా స్థాయి పార్టీ నాయకులతో భేటీ అయ్యానని, ఆ అంశాలేమిటనేది ఇప్పుడిప్పుడే వెల్లడించలేనని, సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని చెప్పారు. ఏ అంశాలపై ఆయన పార్టీ నాయకులతో భేటీ అయ్యారనే విషయంపై ఉత్కంఠత నెలకొంది.
Recommended Video
ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నందున..
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ లేదా మే నెలల్లో పోలింగ్ ఉండొచ్చు. ఏడాది సమయం మాత్రమే ఉన్నందున క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులపై రజినీ ఆరా తీసినట్లు చెబుతున్నారు. సొంతంగా పోటీ చేయాలా? లేక బీజేపీతో కలిసి సీట్ల సర్దుబాటు చేసుకోవాలా?.. బీజేపీతో చేతులు కలిపితే క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వంటి అంశాలపైనే చర్చించారని అంటున్నారు. నిజానికి- రజినీకాంత్ మొదటి నుంచి కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షం అన్నా డీఎంకేతో కలిసి పొత్తు పెట్టుకోవచ్చంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి.