ఆధ్యాత్మికవేత్తగా మారిన రాజీవ్ గాంధీ హంతకుడు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని సుమారు రెండు దశాభ్దాల క్రితం ఎల్టీటీఈ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా హత్య చేశారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనపై మానవ బాంబుని ప్రయోగించి హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో మరణశిక్ష పడ్డ వారిలో ఒకడైన దోషి మురుగన్ వేలూరు జైల్లో ఉన్నాడు. కాలం తెచ్చిన మార్పుతో ఇప్పుడు మురుగన్ నిత్యం కాషాయ వస్త్రాలను ధరిస్తూ ఆధ్యాత్మిక బాట పట్టాడు. కరుడుగట్టిన మనస్తత్వానికి స్వస్తి చెప్పిన మురుగన్ ఆధ్యాత్మకవేత్తగా మారిపోయాడు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో దీక్షలో ఉంటున్న మురుగన్ ఆ రోజుల్లో కేవలం అరటిపండు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. మాంసాహారాన్ని పూర్తిగా త్యజించాడు.
అదే జైల్లోని మహిళా విభాగంలో శిక్ష అనుభవిస్తున్న తన భార్య నళినిని సైతం కలుసుకోవడం లేదని, తోటి ఖైదీలతో కూడా మాట్లాడటం తగ్గించాడని జైలు వర్గాలు తెలిపాయి. ఏడాదికాలంగా మురుగన్ ఆధ్యాత్మిక ధోరణితోనే ఉంటున్నాడని తెలుస్తోంది.