అయోధ్యపై కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠం- అంతా అయిపోయాక రాజీవ్, పీవీలను స్మరిస్తూ..
స్వాతంత్రానికి పూర్వం నుంచే పలు వివాదాలకు కేంద్రంగా నిలిచిన అయోధ్య రామమందిరం వ్యవహారానికి సుప్రీంకోర్టు ఓ శాంతియుత ముగింపు ఇచ్చింది. అయితే అంతకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో తలెత్తిన వివాదాలు, ఓటు బ్యాంకు కారణాలతో సున్నితమైన ఈ సమస్యపై సాధ్యమైనంత మౌనం పాటిస్తూ వచ్చిన ఆ పార్టీ తాజా పరిణామాల నేపథ్యంలో తప్పు సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రాజీవ్, పీవీ హయాంలో ఎదుర్కొన్న అపప్రద నుంచి బయటపడేందుకు తిరిగి అయోధ్య విషయంలో వారు తీసుకున్న సానుకూల నిర్ణయాలను తెరపైకి తెస్తోంది.
Ayodhya:ప్రధాని మోడీ అయోధ్య టూర్ షెడ్యూల్ ఇదే.. ప్రత్యేక ఆహ్వానితుల్లో చిన్నజీయర్ స్వామి
కాంగ్రెస్ కు గుణపాఠంగా అయోధ్య...
దశాబ్దాల నాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని పక్కనబెట్టి శిలాన్యాస్ కు అనుమతించడం ద్వారా ఓ కీలకమైన మలుపు ఇచ్చిన ఘనత నిస్సందేహంగా ఆ నాటి కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీదే. దీన్ని అప్పటి బీజేపీ నేతలు ఎలా క్యాష్ చేసుకున్నారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన పీవీ నరసింహారావు ప్రభుత్వం కూడా బాబ్రీ మసీదు పరిరక్షణ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయినా దేశంలో మెజారిటీ హిందువుల మెప్పు పొందలేకపోయింది. దీనికి అప్పట్లో చాలా కారణాలే ఉన్నా కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని ఎన్నికల అజెండాగా మార్చుకున్న బీజేపీనే ఎక్కువగా లబ్ది పొందింది. ఇన్నాళ్ల తర్వాత అయోధ్యతో సంబంధం లేకుండానే భారీ మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్ధాయికి బీజేపీ చేరుకుంటే దీన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారం కోల్పోయి పతనావస్ధలో ఉంది. దీంతో ఇప్పుడు అయోధ్య కాంగ్రెస్ పార్టీకి ఓ గుణపాఠంగా మారిపోయింది.
అయోధ్యపై దశాబ్దాల మౌనం...
తొలుత జనసంఘ్, ఆ తర్వాత బీజేపీ తమ అజెండాగా మార్చుకున్న అయోధ్య రామమందిరాన్ని దేశంలో మెజారిటీ హిందువులకు మద్దతుగా సమర్ధించలేక, అలాగని వ్యతిరేకించలేక కాంగ్రెస్ పార్టీ పడినన్ని తిప్పలు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పడలేదు. అయోధ్యను సమర్ధిస్తే బీజేపీకి మద్దతు పెరుగుతుందనే భయాలు, అలాగని మౌనంగా ఉంటే హిందూత్వ అజెండాగా బీజేపీ దీంతో లబ్ది పొందుతుందనే భయం మరో పక్క కాంగ్రెస్ పార్టీని దశాబ్దాల పాటు మౌన ప్రేక్షకపాత్ర వహించేలా చేశాయి. చివరికి 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అయోధ్యలో శిలాన్యాస్ కు అనుమతివ్వడం ద్వారా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయినా 1989లో తన తండ్రి రాజీవ్ గాంధీ అయోధ్య పక్కనే ఉన్న సరయూ నది నుంచి తన లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అంశాన్ని 2019 ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ ప్రస్తావించలేక పోయారు.
కాంగ్రెస్ ప్రధానుల విఫలయత్నాలు...
1986లో రాజీవ్ గాంధీ అయోధ్యలో శిలాన్యాస్ కు అనుమతించడం ద్వారా మెజారిటీ హిందువుల మద్దతు పొందవచ్చని భావించారు. కానీ ఆ ప్రయత్నాన్ని అప్పటి బీజేపీ, విశ్వహిందూ పరిషత్ దీన్నో అరకొర ప్రయత్నంగా మాత్రమే అభివర్ణించాయి. మరోవైపు రాజీవ్ వంటి నేత ఓట్ల కోసం హిందూకార్డును ప్రయోగించడంపై దేశంలో మేథావులు, మీడియా, సోషలిస్టులు, బీజేపీయేతర విపక్షాలు కూడా తీవ్రంగా విమర్శించాయి. చివరికి రాజీవ్ తర్వాత ప్రధాని అయిన సొంత పార్టీ నేత పీవీ నరసింహారావు కూడా సమర్ధించలేదు. అయితే ఇదే కోవలో బాబ్రీ మసీదు కూల్చివేతకు పరోక్షంగా కారణమయ్యారన్న విమర్శలను పీవీ కూడా ఎదుర్కొన్నారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్లడం ఎందుకని భావించి బాబ్రీ మసీదు విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరించిన పీవీ.. ఆ మేరకు మైలేజ్ సంపాదించుకోలేకపోయారు.
Recommended Video
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటూ..
గతంలో తమ పార్టీకే చెందిన ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు హిందువుల మెప్పుకోసం ప్రయత్నించి విఫలమైన వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ కప్పిపుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు అయోధ్య రామమందిరం కల నిజమవుతున్న వేళ తప్పనిసరి పరిస్ధితుల్లో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా దీనిపై స్పందించడం ప్రారంభించారు. అయోధ్య వ్యవహారంలో తమ ప్రధానులు చేసిన ప్రయత్నాలను ఇప్పుడు కాంగ్రెస్ లోని కమల్ నాథ్, మనీష్ తివారీ, ప్రియాంక గాంధీ వంటి నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రియాంక అయితే ఓ అడుగు ముందుకేసి జాతి ఐక్యం కావాల్సిన సందర్భంగా రామమందిర భూమి పూజను అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశంలో ఎన్నో అపరిష్కృత సమస్యలకు పరిష్కారం చూపిన కాంగ్రెస్ పార్టీ... అయోధ్య విషయంలో మాత్రం అతి జాగ్రత్తతో రాజకీయంగా నష్టపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.