పెగాసస్ వివాదం: సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలంటూ రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టస్
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు, యాక్టివిస్ట్, జర్నలిస్టులు అధికారుల ఫోన్లను ఇజ్రాయిల్ స్పైవేర్ పెగసస్తో ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించిన రాజ్యసభసభ్యుడు జాన్ బ్రిట్టస్.. ఈ వ్యవహారంపై విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ(మార్కిస్ట్) ఎంపీ జాన్ బ్రిట్టస్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేంద్రం చెప్పిన సమాధానం సరిగా లేదన్నారు. ట్యాపింగ్ చేయడం పౌరులపై సైబర్ దాడి చేయడమేనని అన్నారు. స్పైవేర్ను ఉపయోగించడం అంటే పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో పౌరుల గోప్యతకు ఎలాంటి భగం వాటిల్లలేదని, స్పైవేర్ను ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ చేశారని వస్తున్న ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని ఎలక్ట్రానిక్, సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందలేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ప్రభుత్వానికి తెలియకుండా విదేశానికి చెందిన సంస్థలు ఎలా ట్యాపింగ్ చేయగలవని ఎంపీ ప్రశ్నించారు.
కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గత గురువారం రాజ్యసభలో అధికారిక ప్రకటన చేశారు. రాజకీయ, మీడియా ప్రముఖులపై కేంద్రం నిఘా పెట్టిందని, అందుకోసం ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ ను వాడిందంటూ మీడియాలో వచ్చిన రిపోర్టులు అవాస్తవమని మంత్రి పునరుద్ధాఘించారు. కేంద్రం నిఘాకు పాల్పడిందంటూ మీడియాలో వచ్చిన రిపోర్టులను ప్రభుత్వం సహా సుప్రీంకోర్టు కూడా ఖండించిందని, మీడియా రిపోర్టులు వాస్తవదూరంగా ఉన్నాయని, స్పైవేర్ వాడినట్లు ప్రాథమిక ఆధారాలేవీ సదరు రిపోర్టుల్లో లేవని మంత్రి చెప్పారు.
పెగాసస్ ఉదంతంపై అసలు ఆ రిపోర్టులో ఏముందో విపక్ష ఎంపీలు చదివితే బాగుంటుందని, పెగాసస్పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయని, అలాంటి వాటికి ఎలాంటి ఆధారాలు లేవని మంత్రి వైష్ణవ్ గుర్తుచేశారు. సరిగ్గా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందే కొన్ని వెబ్ సైట్లలో పెగాసస్ స్పైవేవర్ నివేదికలు వచ్చాయని, బహుశా ఇదేమీ యాదృచ్చికం కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచే కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు జరిగిఉండొచ్చని ఐటీ మంత్రి వ్యాఖ్యానించారు.