అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ ఆగస్టు మొదటి వారంలోనే: మోడీ చేతుల మీదుగా..
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై శనివారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు మొదటి వారంలోనే రామమందిరం భూమి పూజ నిర్వహించాలని తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వీలును బట్టి ఆగస్టు 3 లేదా ఆగస్టు 5వ తేదీన భూమి పూజకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రధానిని ఆహ్వానించామని చెప్పారు. పూజ చేసిన రోజే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా, అయోధ్య రామమందిరం ప్రాంతంలో ప్రధాని మోడీ మొదటి పర్యటన ఇదే కానుంది.
లార్సెన్ అండ్ టర్బో సంస్థ పరీక్షల కోసం మట్టి నమూనాలను సేకరిస్తోందన్నారు. ఆలయ నమూనాలను సిద్ధం చేస్తోందని, వాటి ఆధారంగానే ఆలయాన్ని నిర్మిస్తున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.
వర్షాకాలం తర్వాత దేశంలోని నాలుగు లక్షల ప్రాంతాల్లో 10 కోట్ల కుటుంబాలను సంప్రదించనున్నట్లు తెలిపారు. దేశంలోని పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక విరాళాలు సేకరించనున్నట్లు వెల్లడించారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేసరికి 3 నుంచి 3.5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కాగా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశానికి ట్రస్ట్ సభ్యులుగా హాజరుకాగా, ముగ్గురు సభ్యులు.. వీడియో సమావేశంలో పాల్గొన్నారు.