దటీజ్ కోవింద్! ఫ్యామిలీని సైతం పక్కన పెట్టి.. నిరాడంబరంగా..
న్యూఢిల్లీ : రాజకీయాల్లో నాయకులు కొద్దిమందే అయినా అనుచరులకు మాత్రం కొదవ ఉండదు. ఒక్కో నాయకుడికి ఉండే వందల మంది అనుచరులు చేసే హల్చల్ అంతా ఇంతాకాదు.
ఇక నాయకుడి కుటుంబ సభ్యుల విషయానికొస్తే.. వారిదే రాజ్యం. వారే ప్రభుత్వం అయినట్లు పేద్ద బడాయిపోతుంటారు. సదరు నాయకుడిని కలవడానికి వచ్చే వ్యక్తులు, అధికారులు ముందుగా ఆయన కుటుంబ సభ్యుల ప్రాపకం సంపాదించాల్సిందే.
నిగర్వి, నిరాడంబరుడు.. మన రాష్ట్రపతి
ప్రముఖులకు పరిచయస్తులు కావడమే అదేదో అర్హత అయినట్లు వెళ్లిన చోటల్లా హడావిడిచేస్తుంటారు కొందరు. ఇక ఆ ప్రముఖుడి కుటుంబసభ్యులు చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. అన్నిచోట్లా వారికి వీఐపీ ట్రీట్మెంట్ దక్కాల్సిందే. అయితే అందరు నాయకులు, ప్రముఖులు అలా ఉండరు. కొంతమంది ప్రముఖులు నిరాడంబరంగా ఉంటారు. అప్పనంగా ప్రత్యేక సేవలు చేయించుకోరు, కొన్నిసార్లు ప్రోటోకాల్ హక్కుల్ని సైతం వదిలేసుకుని హుందాగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకి మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. మొన్న రిపబ్లిక్డే రోజున ఆయన వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం.
‘ఎట్ హోం’కు కుటుంబ సభ్యులకు సైతం నో...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన ‘ఎట్ హోమ్' కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన కుటుంబ సభ్యులను సైతం ఆహ్వానించలేదు. ఈ కార్యక్రమానికి ఆయన తన భార్య సవితను మాత్రమే తనతో తీసుకెళ్లారు. ఎట్ హోమ్ అంటే ఏదో రాజకీయ వందనాలు, మొహమాటపు పలకరింపులు, అక్కరలేని ఆహ్వానితులతో జరగకూడదని రాష్ట్రపతి భావించారట. కార్యక్రమ ప్రాంగణం.. స్ఫూర్తిదాయక సమ్మేళనంలా, చక్కటి సృహృద్భావ వాతావరణంలో, ప్రేరణను ఇచ్చే, ప్రేరణ పొందే వ్యక్తులతో కళకళలాడాలని కోరుకున్నారట. ఈ క్రమంలోనే తన కుటుంబీకులను కూడా ఆహ్వానించవద్దని ఆయన తన సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది.
తగ్గిన అతిథుల సంఖ్య...
రిపబ్లిక్డే సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన ‘ఎట్ హోమ్' కార్యక్రమానికి ఈసారి అతిథుల సంఖ్య కూడా బాగా తగ్గింది. అతితక్కువగా 724 మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. గత ఏడాది ఈ కార్యక్రమానికి 2015 మందికి ఆహ్వానాలు వెళ్ళగా, అంతకుముందు ఏడాది అంటే.. 2016లో 2,347 మందిని ఆహ్వానించారు. ప్రణబ్ వారసుడిగా పదవి చేపట్టిన కోవింద్.. గతానికి భిన్నంగా ఈ ఏడాది అతికొద్ది మందిని, అది కూడా అరుదైన వ్యక్తులను రాష్ట్రపతి భవన్లో జరిగిన ‘ఎట్ హోమ్' కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఎవరెవరు పాల్గొన్నారంటే...
ఆసియాన్ దేశాల అధినేతలు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేబినెట్ మంత్రులు, ముఖ్య అధికారులు, అమరవీరుడు, ‘అశోకచక్ర' జ్యోతి ప్రకాష్ నిరాలా కుటుంబం, అండర్-17 ఇండియన్ ఫుట్బాల్ టీమ్ సారథి అమర్జిత్ సింగ్, దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(డిక్కీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన మిలింద్ కాంబ్లే, సీబీఎస్ఈ, ఐఎస్సీ, యూపీఎస్సీ పరీక్షల్లో టాపర్లుగా నిలిచినవారు, క్రీడారంగంలో సత్తా చాటుకున్న ఫొగట్ సోదరీమణులు, వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతీయువకులు రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్నవారిలో ఉన్నారు.
కోవింద్ కుటుంబం.. ఆడంబరాలకు దూరం...
రామ్నాథ్ కోవింద్-సవిత దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె స్వాతి, కుమారుడు ప్రశాంత్ కుమార్. వీరిద్దరూ ప్రచారానికి చాలా దూరంగా ఉంటారు. కోవింద్ రాష్ట్రపతి అయ్యేంత వరకు స్వాతి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్గా పనిచేశారు. అయితే, భద్రతాకారణాల వల్ల ఇప్పుడామె గ్రౌండ్ డ్యూటీకి మాత్రమే పరిమితమయ్యారు. కోవింద్ కుమారుడు ప్రశాంత్ కుమార్ ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.