బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం కట్టాలి: యుపి గవర్నర్
అయోధ్య: ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ తాజాగా వివాదం సృష్టించారు. భారత పౌరుల కోరిక మేరకు బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం నిర్మించాలని ఆయన గురువారంనాడు అన్నారు. ఇది వివాదానికి దారి తీసింది. సాధ్యమైనంత త్వరగా రామాలయాన్ని నిర్మించాలని, అది భారత పౌరుల కోరిక అని, వారి కోరికను నెరవేర్చాలని ఆయన అన్నారు.
ఫైజాబాద్లో అవధ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. గత నెలలో విశ్వ హిందూ పరిషత్ (విహిచ్పి) నాయకుడు అయోధ్యలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన ఐదేళ్లలో సమస్యను పరిష్కరించాలని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ పథకం రచిస్తున్నారని అన్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆయన అన్నారు.

కేంద్రంలో ఎన్డీయె ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది జులైలో రామ్ నాయక్ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. రామ్ నాయక్ వ్యాఖ్యలపై హషీం అన్సారీ స్పందించారు. తాము సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని తాను గతంలోనే చెప్పానని, అయితే చర్చలను ప్రారంభించడానికి ముందు బాబ్రీ మసీదు కూల్చివేత దోషులను శిక్షించాలని ఆయన అన్నారు గత 22 ఏళ్లుగా విచారణ సాగుతోందని, ఒక్కరికి కూడా శిక్ష పడలేదని ఆయన అన్నారు.
కాగా, రామ్ నాయక్ వ్యాఖ్యలను బిజెపి శుక్రవారంనాడు సమర్థించింది. భారత పౌరుల కోరిక మేరకు బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం నిర్మించాలనే రామ్ నాయక్ ప్రకటన సరైందేనని బిజెపి ప్రధాన కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. రాముడి భక్తులు తప్పా, అయోధ్యలో రామాలయం ఉండాలని కోరుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications