Ramadan 2022 Date India: భారత్లో రంజాన్ చంద్రుడు కనిపించే సమయం ఇదే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ముస్లింలు జరుపుకొనే అతి పెద్ద పండుగ.. రంజాన్. నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను పాటించిన అనంతరం భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ముస్లింలు నెల రోజుల కాలాన్ని లెక్కించడానికి క్యాలెండర్కు బదులుగా చంద్రుడిని ఆధారంగా తీసుకుంటారు. చంద్రుడి దర్శనంతో ఆరంభం అయ్యే ఉపవాస దీక్షలను మళ్లీ.. చంద్రదర్శనం తరువాతే ముగిస్తారు. ఆ మరుసటి రోజే పండగను జరుపుకొంటారు.
నెల రోజుల తరువాత కూడా చంద్రుడు కనిపించకపోతే.. మరో రోజు ఉపవాస దీక్షలను కొనసాగిస్తారు. ఈ సంవత్సరం అదే జరుగుతోంది. రంజాన్ ప్రత్యేక ఉపవాస దీక్షలను ముస్లింలో కొనసాగిస్తున్నారు. రంజాన్ చంద్రుడు కనిపించకపోవడంతో ఇవ్వాళ కూడా ఉపవాస దీక్షల్లో ఉంటోన్నారు. మంగళవారమే రంజాన్ పండుగను నిర్వహించుకోవాల్సి ఉంటుందని మర్కజీ చాంద్ కమిటీ ప్రకటించింది. దీనితో ఇవ్వాళ కూడా ఉపవాస దీక్షలను కొనసాగిస్తున్నారు ముస్లింలు.
కిందటి నెల 2వ తేదీన పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. నెలవంకను దర్శించిన మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలను చేపట్టారు ముస్లింలు. సరిగ్గా మళ్లీ 2వ తేదీ నాడే నెలవంక కనిపించనుంది. ఇవ్వాళ చంద్రుడిని దర్శించిన తరువాతే తమ దీక్షలను ఉపసంహరించుకుంటారు. మంగళవారం నాడు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. శనివారం అమావాస్య. రెండో రోజు చందమామ కనిపిస్తుంటుంది. ఈ సంవత్సరం అమావాస్య రెండో రోజు కూడా భారత్లో నెలవంక దర్శనం ఇవ్వలేదు.
సౌదీ అరేబియాలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అక్కడ కూడా చందమామ కనిపించకపోవడంతో ఉపవాస దీక్షలను కొనసాగించాల్సి వచ్చింది. రంజాన్కు ముందు రోజు చంద్రుడు కనిపించడా? లేదా? అనే విషయం భారత ముస్లింలు సాధారణంగా గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుంటారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వెలువడే ప్రకటనపై ఆధారపడుతుంటారు. వాతావరణం వల్ల భారత్లో కాకపోయినా.. ప్రత్యేకించి సౌదీ అరేబియాలో చందమామ కనిపించినట్లు తెలిసినా చాలు.
ఆ మరుసటి రోజే పండగ కోసం ఉపక్రమిస్తారు. డేట్ అండ్ టైమ్ వెబ్సైట్ ప్రకారం.. భారత్లో ఈ సాయంత్రం 6:53 నిమిషాలకు నెలవంక కనిపించే అవకాశం ఉంది. దీన్ని దర్శించిన వెంటనే ముస్లింలు ఉపవాస దీక్షలను విరమిస్తారు. ఆ మరుసటి రోజే భక్తి ప్రపత్తులతో రంజాన పండుగను జరుపుకొంటారు. రంజాన్ పండగ కోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.