సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎవరో తెలుసా? ఆయనకే ఛాన్స్ ఇవ్వాలంటూ చీఫ్ జస్టిస్ రెకమెండ్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి హోదా ప్రతిష్ఠాత్మకమైనది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)గా పిలిపించుకోవడంలో, గుర్తింపు పొందడంలో ఉండే భావనే వేరు. దేశ న్యాయ వ్యవస్థకు సంబంధించినంత వరకు ప్రథమ వ్యక్తిగా గుర్తింపు పొందే ప్రధాన న్యాయమూర్తి పదవి మరో నెలరోజుల్లో ఖాళీ కానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం కొనసాగుతోన్న జస్టిస్ రంజన్ గొగొయ్ వచ్చే నెల 17వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన తరువాత ప్రతిష్ఠాత్మకమైన ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది న్యాయ వర్గాల్లో అప్పుడే చర్చ కూడా మొదలైంది.

చీఫ్ జస్టిస్ గా బొబ్డె పేరు సిఫారసు..
జస్టిస్ రంజన్ గొగొయ్.. దీనికి తెర దించినట్టే కనిపిస్తోంది. తన తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అరవింద్ బొబ్డెను నియమించాలని సూచించారు. ఎస్ ఏ బొబ్డె పేరును సిఫారసు చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ.. కొలీజియానికి పంపిస్తుంది. సీనియారిటీ సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత.. కొలీజియం సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి పేరును ఆమోదిస్తుంది. వచ్చే నెల రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో.. కాబోయే ప్రధాన న్యాయమూర్తిని ఎన్నుకోవడానికి అవసరమైన చర్యలను కేంద్రం చేపట్టింది.

అయోధ్య ధర్మాసనంలో..
సుప్రీంకోర్టులో రంజన్ గొగొయ్ తరువాత ఆ స్థాయిలో సీనియారిటీగా ఉన్న న్యాయమూర్తి బొబ్డె మాత్రమే. దీనితో ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఎంపిక లాంఛనప్రాయమే కావడానికి అవకాశాలు ఉన్నాయి. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై విచారణ కొనసాగించడానికి ఏర్పాటైన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనంలో ఎస్ ఎ బొబ్డె ఒకరు. అయోధ్య భూ వివాదం కేసు విచారణ సందర్భంగా ఆయన పేరు విస్తృతంగా వినిపించింది. అంతకుముందు కూడా కొన్ని సున్నితమైన అంశాలపై ఆయన అందరికీ ఆమోద యోగ్యమైన తీర్పులను ఇచ్చారు.

మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా..
బొబ్డె మహారాష్ట్రీయుడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ ఆయన స్వస్థలం. 1956 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారు. నాగ్ పూర్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. బాంబే హైకోర్టు అనుబంధంగా కొనసాగుతోన్న నాగ్ పూర్ బెంచ్ 1978లో తన పేరును నమోదు చేసుకున్నారు. అడ్వొకేట్ గా న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2000 మార్చి 29వ తేదీన ఆయన బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2012 అక్టోబర్ 16వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆరు నెలల తరువాత ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక అయ్యారు.

ఆధార్ కార్డు లింకేజీపై కీలక తీర్పు..
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న అన్ని సంక్షేమ పథకాలు సహా బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఇతర కార్యకలాపాలను ఆధార్ కార్డుతో లింకు చేయాడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టింది ఆయనే. బొబ్డె సారథ్యంలో ఏర్పాటైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జాస్తి చలమేశ్వర్, చొక్కలింగం నాగప్పన్ లతో కలిసి ఆయన ఆ పిటీషన్ పై విచారణ నిర్వహించారు. కేశవానంద భారతి, అయోధ్య భూ వివాదం తరువాత సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగిన కేసుగా ఆధార్ కార్డు పిటీషన్ కు గుర్తింపు ఉంది. 38 రోజుల పాటు కొనసాగిన ఆధార్ కార్డు లింకేజీపై బొబ్డె సారథ్యంలోని ధర్మాసనం కార్డుదారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications