రంజిత్ రామచంద్రన్: నైట్ వాచ్మెన్ నుంచి ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా.. గుడిసె నుంచి మొదలైన జర్నీ...
పేదరికం నేర్పించే పాఠాలు జీవితంలో కసిని పెంచుతాయి... చీకట్లోనే మగ్గిపోకుండా వెలుతురు వైపు నడిపించే ఆలోచనలను పుట్టిస్తాయి... సాధించాలన్న పట్టుదలను నరనరాన నూరిపోస్తాయి... ఈ లక్షణాలన్ని పునికిపుచ్చుకున్న ఓ యువకుడు నైట్ వాచ్మెన్ స్థాయి నుంచి ప్రతిష్ఠాత్మక ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాడు. ఆ యువకుడు కేరళకు చెందిన 28 ఏళ్ల రంజిత్ రామచంద్రన్. పేదరిక నేపథ్యం తన చదువుకు గుదిబండలా మారినా ఎక్కడా నిరాశ చెందలేదు... ఎవరినీ నిందించలేదు.. ఓవైపు వాచ్మెన్గా పనిచేస్తూనే... మరోవైపు చదువును కొనసాగించాడు... చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు.
ఎవరీ రంజిత్ రామచంద్రన్...
కేరళలోని కసర్గఢ్ జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో రంజిత్ రామచంద్రన్ జన్మించాడు. ఆయన తల్లి నరేగా ఉపాధి కూలీ,తండ్రి టైలర్.టార్ఫాలిన్ కవర్తో కప్పబడిన ఒక చిన్న గుడిసెలో వీరి నివాసం. చిన్నతనం నుంచి వెంటాడుతున్న పేదరికం,దానివల్ల అనుభవిస్తున్న కష్టాలు రామచంద్రన్లో చదువు పట్ల ఏకాగ్రతను పెంచాయి. చదువు మాత్రమే తమ జీవితాలను మారుస్తుందని గ్రహించాడు. అందుకే ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా చదువును వదిలిపెట్టలేదు. స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఓ బీఎస్ఎన్ఎల్ టెలీఫోన్ ఎక్స్చేంజ్లో నెలకు రూ.4వేల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించాడు.
మద్రాస్ ఐఐటీలో పీహెచ్డీ...
అలా ఓవైపు పనిచేస్తూనే మరోవైపు చదువును కొనసాగిస్తూ పీజీ పూర్తి చేశాడు. ఆపై మద్రాస్ ఐఐటీలో పీహెచ్డీ సీటు పొందాడు. కానీ తనకున్న పరిస్థితుల్లో ఐఐటీలో చదవగలనా లేదా అని సంశయించాడు. పైగా తనకు మలయాళం తప్ప ఇంగ్లీష్ రాదు.దీంతో ఒకానొక దశలో పీహెచ్డీ సీటును వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మద్రాస్ ఐఐటీలో రంజిత్ గైడ్ డా.సుభాష్ శశిధరన్,ఆయన భార్య వైదేహీ అందించిన ప్రోత్సహం,సహకారంతో ముందడుగు వేశాడు. ఎన్ని ఇబ్బందులు వెంటాడుతున్నా లెక్కచేయలేదు. పీహెచ్డీ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా
అలా 2016లో రంజిత్ రామచంద్రన్ మద్రాస్ ఐఐటీ నుంచి పీహెచ్డీ చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులు బెంగళూరు క్రైస్ట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అక్కడ పనిచేస్తుండగానే ప్రతిష్ఠాత్మక ఐఐఎం రాంచీలో రంజిత్ రామచంద్రన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపికయ్యారు. కసర్గఢ్లోని ఓ చిన్న గుడిసె ఇంటి నుంచి ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకూ సాగిన తన ప్రయాణాన్ని రంజిత్ ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. మీ జర్నీ చాలా స్పూర్తిదాయకంగా ఉందని చాలామంది ఆయన్ను ప్రశంసిస్తున్నారు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కూడా రంజిత్కు అభినందనలు తెలిపారు.