ఉన్నావో లైంగిక దాడి: యోగీ సర్కార్కు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన ఉనావో లైంగిక దాడి కేసులో యోగి ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. . అత్యాచార బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించిన నివేదికను ఇవ్వాలని జాతీయ మానవహక్కుల కమిషన్ ఆ నోటీసులో యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బాధితురాలి కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోనేలా హమీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.బిజెపి ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు, తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ యువతి ఆరోపణలు చేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాద్ ఇంటి ముందు బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. బాధితురాలు సీఎం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఈ ఘటన జరిగిన మరునాడే బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలోనే మరణించాడు. అయితే పోలీసు కస్టడీలో మరణించిన వ్యక్తి, అందుకు దారితీసిన పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బాధితురాలి తండ్రిని అదుపులోకి తీసుకోవడం నుండి ఆయన మరణించిన సమయం వరకు చోటు చేసుకొన్న పరిణామాలపై సమగ్రంగా నివేదికను ఇవ్వాలని జాతీయ మానవహక్కుల కమిషన్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు నాలుగు వారాల గడువును యూపీ సర్కార్ కు జాతీయ మానవహక్కుల కమిషన్ సూచించింది.
ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే బాధితురాలు ఆరోపణలు చేయడం యోగీ సర్కార్ను ఇబ్బందుల్లోకి నెట్టింది.