పోలీసు ప్రేమ: రేప్ చేస్తారని దాక్కున్న చెల్లెళ్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వ్యక్తి ఇద్దరు చెల్లెళ్లను రేప్ చేసి ముఖానికి మసిపూసి నగ్నంగా గ్రామంలో ఊరేగించాలని ఆ గ్రామ పెద్దలు పంచాయితీలో తీర్పు చెప్పారు. ఆ కానిస్టేబుల్ సైతం ఏమి చెయ్యలేక తన కుటుంబ సభ్యులను రహస్య ప్రాంతంలో దాచి పెట్టాడు.
ఒక అన్న వేరే కులం అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నందుకు ఇద్దరు చెల్లెళ్లు ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు. దలితులుగా పుట్టడం మేము చేసిన నేరామా అని ప్రశ్నిస్తున్నారు. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉంది.
గ్రామ పెద్దలు మమ్మలి రేప్ చెయ్యమన్నారని, న్యాయం చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి, మానవహక్కుల సంఘానికి, షెడ్యూల్ కులాల కమిషన్ కు లేఖలు వ్రాసి న్యాయం చెయ్యాలని మనవి చేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలేదని బాధితురాలు మీనాక్షి కుమారి (23) విలపిస్తున్నది.
న్యూఢిల్లీలో మీనాక్షి కుమారి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పేట్ సమీపంలోని సంక్రోట్ గ్రామంలో మీనాక్షి కుమారి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈమెకు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అన్నలు, ఒక చెల్లి ఉంది.
ఢిల్లీ నగరానికి కేవలం 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న సంక్రోట్ గ్రామంలో జాట్ కులస్తులు 7 వేల మంది, దలితులు 250 మంది ఉన్నారు. మీనాక్షి కుమారి దలిత కులస్తులు. ఈమె చిన్నన్న రవి కుమార్ రెండు సంవత్సరాల నుండి జాట్ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు.
అయితే ప్రేమ వివాహం చేసుకుంటే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో రవికుమార్, అతని ప్రేయసికి తెలుసు. రవికుమార్ కుటుంబ సభ్యులు అతనిని మందలించారు. వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలని రవికుమార్ ప్రియురాలికి నచ్చ చెప్పాడు.
అమ్మయి కుటుంబ సభ్యులు బలవంతం చేసి హర్యానాకు చెందిన వ్యక్తితో వివాహం చేయించారు. అయితే ఆమె కొంత కాలం కాపురం చేసి పుట్టింటికి వచ్చేసింది. తరువాత రవికుమార్ని రహస్యంగా వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు ఊగిపోయారు.
రాజకీయ పలుకుబడి ఉపయోగించి రవికుమార్ మీద మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడని కేసు నమోదు చేసి చితకబాది మీరట్ జైలుకు పంపించారు. మీనాక్షి కుటుంబ సభ్యులు ఢిల్లీలో వివాహ శుభకార్యానికి వెళ్లారు. అదే సందర్బంలో గ్రామంలో పంచాయితీ జరిగింది.
రవికుమార్ ఇద్దరు చెల్లెళ్లను బహిరంగంగా రేప్ చేసి ముఖానికి మసిపూసి అన్ని వీధులలో ఊరేగించాలని జాట్ గ్రామపెద్దలు తీర్పు చెప్పారు. ఢిల్లీలో మీనాక్షి పెద్దన్న కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. వీరి పక్కింటి వారు అతనికి ఫోన్ చేసి గ్రామానికి రావద్దని చెప్పారు.
పోలీసుగా పని చేస్తున్నవ్యక్తి సైతం ఏమి చెయ్యలేక ఢిల్లీ శివార్లలోని ఒక ఇంటిలో కుటుంబ సభ్యులను దాచిపెట్టాడు. ప్రముఖ న్యాయవాది రాహుల్ త్యాగి సుప్రీం కోర్టులో మీనాక్షి కేసును వాదిస్తున్నారు. గ్రామానికి వెలితే కచ్చితంగా మమ్మల్ని రేప్ చేస్తారని మీనాక్షి వాపోతున్నది.