ఘోరం: యువతిపై 6నెళ్లపాటు రోజుకు 10మంది రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయిలకు అక్కడ పూర్తిగా రక్షణ లేకుండా పోతోందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు, పోలీసులు చెబుతున్నా.. ఇలాంటి ఘటనలు కొనసాగుతుండటం విచారకరం.
తాజాగా, ఓ 18 ఏళ్ల యువతిపై పలువురు వ్యక్తులు ఆరు నెలల పాటు నిరంతరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రోజుకు పది చొప్పున ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, ఆమె ఇప్పుడు కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
ఆమె తన బంధువని చెబుతూ ఓ వ్యక్తి ఈ బాధితురాలిని ఢిల్లీలోని గురుతేజ్ బహదూర్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం చేర్చాడు. కాగా, చేర్చిన తర్వాత వెంటనే వెళ్లిపోయాడు.
కనీసం తన కాళ్ల మీద నిలబడే పరిస్థితిలో కూడా ఆమె లేకపోవడంతో.. బాధితురాలిని చూసి వైద్యులు నిర్ఘాంతపోయారు. ఆమెపై పదే పదే అత్యాచారాలు జరగడం వల్లే ఆమె తీవ్రంగా గాయపడిందని చెబుతున్నారు.
గత సంవత్సరం ఆమెను పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చారని, తర్వాత రిషికేశ్, హరిద్వార్, మనాలి, మంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెపై పలువురు వ్యక్తులు అత్యాచారం చేశారని తెలిసింది.
ఈమె జాడ తెలుసుకోడానికి ఏప్రిల్ నెల నుంచి శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థ ప్రయత్నించింది కానీ, కోల్కతా పోలీసుల ద్వారా ఆమె వివరాలు సోమవారమే తెలిశాయి. ఆమెను ఈ స్థితికి తీసుకొచ్చిన వ్యక్తిని గుర్తించడంలో శక్తివాహిని సంస్థ కోల్కతా పోలీసులకు సాయపడింది.
ఆమెను ఆస్పత్రికి తెచ్చిన వ్యక్తి వివరాలు తెలుసుకోడానికి ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజి పరిశీలించాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. కాగా, కోల్కతా పోలీసులు ఢిల్లీకి వచ్చి బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత, ఆమెను కోల్కతాకి తరలించి కేసు విచారణ చేపట్టనున్నారు.