జీవితాలు బాగున్నాయి: సర్వేలో బీజేపీకి జై కొట్టారు, నాకు రేటింగ్ ఇవ్వండి: మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్ల పాలనపై టైమ్స్ గ్రూప్ చేసిన సర్వేలో బీజేపీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ గ్రూప్ ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 9 భాషల్లోని 9 మీడియా మాధ్యమాల ద్వారా సర్వే చేసింది. ఆన్లైన్లో జరిగిన ఈ సర్వేలో 8,44,646 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎక్కువమంది బీజేపీకి అనుకూలంగా ఉన్నారు.
ప్రధానమంత్రిగా మోడీకి 71 శాతానికి పైగా మంది ఓటేస్తే రాహుల్ గాంధీకి దాదాపు పన్నెండు శాతం మంది ఓటేశారు. మోడీ పాలన చాలా బాగుందని 47 శాతం మంది భావిస్తే బాగా బాగుందని 20.60 మంది, పర్వాలేదని 11.38 శాతం, బాగాలేదని 20.55 శాతం మంది పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మంచిది ఏదంటే 33.42 శాతం మంది జీఎస్టీ అంటే, 21.90 శాతం మంది నోట్ల రద్దు అని, 19.89 మంది పాకిస్తాన్పైసర్జికల్ స్ట్రయిక్స్ అని చెప్పారు.
ఉద్యోగాలు కల్పించకపోవడమే పెద్ద వైఫల్యమని 28.30 శాతం మంది అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు, వ్యవసాయ సమస్యలు, కాశ్మీర్ విధానం, ఇతరాలు ఆ తర్వాత ఉన్నాయి. నిరుద్యోగ నిర్మూలనకు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయని 21.28 శాతం మంది అంటే, బాగున్నాయని 37.29 శాతం మంది, బాగాలేవని 36.03 శాతం, చెప్పలేమని 5.40 శాతం మంది చెప్పారు. మైనార్టీల్లో అభధ్రతా భావం ఉందా అంటే ఔనని ముప్పై శాతం మంది, లేదని దాదాపు అరవై శాతం మంది చెప్పారు.
విదేశీ విధానం చాలా బాగుందని అరవై రెండు శాతం మంది అభిప్రాయపడ్డారు. బాగాలేదని 15 శాతం మంది చెప్పారు. ప్రతిపక్షాలన్ని కలిసి మోడీని ఎదుర్కోగలవా అంటే దాదాపు 29 శాతం మంది అవునని, లేదని 57 శాతం మంది చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత మోడీ ప్రభుత్వమే వస్తుందని డెబ్బై మూడు శాతానికి పైగా చెబితే దాదాపు పదకొండు శాతం మంది రాహుల్ వస్తారని చెప్పారు. మోడీ ప్రభుత్వంలో జీవితాలు బాగుపడ్డాయని 55 శాతం మంది చెబితే, లేదని 33 శాతానికి పైగా చెప్పారు.
నా ప్రభుత్వానికి రేటింగ్ ఇవ్వండి
తన నాలుగేళ్ల పాలన పైన రేటింగ్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుతున్నారు. ఆయన ఈ మేరకు తన నమో యాప్ పైన శనివారం సర్వేను లాంచ్ చేశారు. బీజేపీ పాలనపై, ఎంపీలు, ఎమ్మెల్యేల పాలనపై రేటింగ్ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.