ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్కు ఇండియా వార్నింగ్: డేటా చోరీ చేస్తే చర్యలు
న్యూఢిల్లీ:భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని చోరి చేసినట్టు తెలిస్తే సమన్లు పంపుతామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ను హెచ్చరించారు. భారతీయ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. పత్రికా స్వేచ్చకు, భావ ప్రకటన స్వేచ్చకు తాము అడ్డం కాదన్నారు. అయితే దాన్ని దుర్వినియోగం చేస్తే చట్ట పరమైన చర్యలను తీసుకొంటామని హెచ్చరించారు.
దేశంలో సుమారు 20 కోట్ల మంది భారతీయులు ఫేస్బుక్ను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. అమెరికా తర్వాత ఫేస్బుక్కు అతి పెద్ద మార్కెట్గా ఉందని ఆయన చెప్పారు.
ఐటీ చట్టం కింద మాకు కఠిన చర్యలు తీసుకునే వీలుంది. ఆ చట్టం కింద భారత్కు రప్పించడానికి మీకు సమన్లు జారీ చేయడం సహా పలు చర్యల్ని తీసుకుంటామని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాల సమచారం చిక్కిందన్న వార్తల నేపథ్యంలో మంత్రి ఈ మేరకు ఫేస్బుక్ సీఈఓను హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.