కీలక వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ, పావు శాతం తగ్గిన రెపో రేటు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ముగిసింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలక వడ్డీ రేట్లపై పావు శాతం కోత విధించారు.
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ముగిసింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలక వడ్డీ రేట్లపై పావు శాతం కోత విధించారు.
వీటి ప్రకారం రెపో రేటు నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో ప్రస్తుత రెపో రేటు 6.25 నుంచి 6.0 శాతంగా ఉంటుంది. గత ఏడేళ్లలో ఇదే కనిష్ఠ రెపోరేటు.
రివర్స్ రెపో రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంకు రేట్లపై కూడా కోత విధించారు.
గత పాలసీ రేట్లు.. రెపో రేటు - 6.25 శాతం, రివర్స్ రెపో రేటు - 6 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు - 6.50 శాతం, బ్యాంక్ రేటు - 6.50 శాతంగా ఉంది.
తాజా సమీక్ష నేపథ్యంలో ప్రస్తుతం పాలసీ రేట్లు.. రెపో రేటు - 6 శాతం, రివర్స్ రెపో రేటు - 5.75 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు - 6.25 శాతం, బ్యాంక్ రేటు - 6.25 శాతంగా ఉండనున్నాయి.
ప్రభుత్వ వర్గాల నుంచి పారిశ్రామిక ప్రతినిధుల నుంచి రెపో రేటు తగ్గింపునకు పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో గత 10 నెలల కాలంలో మొట్టమొదటిసారి ఆర్బీఐ ఈ రేటు కోతను చేపట్టింది.
రెపో రేటు అంటే బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వడ్డీరేటు. ద్రవ్యోల్బణ భయాల కారణతో ఇన్నిరోజులు యథాతథ రేటును కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ, ఇటీవల ద్రవ్యోల్బణ గణాంకాలు తీవ్ర కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో కోత నిర్ణయం ప్రకటించింది. ఈ పాలసీలో మార్కెట్లకు శుభవార్త అందించింది.