నోట్ల రద్దు ఎఫెక్ట్: 'ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ కనిపించుట లేదు!'
రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన అనంతరం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్బీఐ) ఉర్జీత్ పటేల్ కనిపించడం లేదంటూ సామాజిక అనుసంధాన వేదికలలో చురకలు వేస్తున్నారు.
ముంబై: రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన అనంతరం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్బీఐ) ఉర్జీత్ పటేల్ కనిపించడం లేదంటూ సామాజిక అనుసంధాన వేదికలలో చురకలు వేస్తున్నారు. ప్రధాని నోట్ల రద్దు ప్రకటన చేసి పదిహేను రోజులు దాటింది.
ఐటీ వలలో.. పావులు కదుపుతున్న మోడీ
దేశంలో ఎక్కడ కూడా తగినంత నగదు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మోడీ ప్రకటనను చాలామంది స్వాగతిస్తున్నారు. అదే సమయంలో ఇబ్బందుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా కొందరు నెటిజన్లు మోడీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు మోడీతో పాటు ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ను కూడా టార్గెట్ చేశారు. అసలు ఆర్బీఐ గవర్నర్ ఏం చేస్తున్నారని కొందరు నిలదీస్తున్నారు. మరికొందరు ఆయన కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ పోస్టులు ఇంటర్నెట్లో హల్చల్ సృష్టిస్తున్నాయి. నోట్ల రద్దు ప్రకటన అనంతరం ఉర్జీత్ అంతగా కనిపించలేదు.దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ' అదృశ్యం.. మీరు ఉర్జీత్ను చూశారా' అంటూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు.
మరికొందరు ఉర్జీత్ ఫోటో పెట్టి.. ఉర్జీత్ పటేల్, వయస్సు 53 ఏళ్లు. చివరిసారిగా ఆర్బీఐ భవన్ వద్ద కనిపించాడు. అన్నింటినీ క్షమించాం. దయచేసి ఇంటికి రా. ఎవరైనా ఆచూకీ చెబితే రివార్డు ఇస్తాం. దయచేసి ఈ ఫోన్ నెంబర్కు కాల్ చేయండి.. అంటూ మధు మీనన్ ట్వీట్ చేశారు. ఇది వైరల్ అయింది.
మరికొందరైతే.. తాను చేసిన పొరపాటుకు చింతిస్తూ ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండి ఉంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు ఉర్జీత్ బాధ్యత వహించాలని ఆలిండియా బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.