కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ
ముంబై: కీలక వడ్డీ రేట్లలో మార్పు లేదని భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిమిత్తం పరపతి విధాన కమిటీ (ఎంసీపీ) మంగళ, బుధవారాల్లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ బుధవారం వెల్లడించింది.
ద్రవ్యోల్బణం పెరిగిన దృష్ట్యా ఈ సారి కీలక రేట్లలో మార్పులు చేయలేదని, వాటిని యథాతథంగానే ఉంచనున్నట్లు ప్రకటించింది. అక్టోబరులో జరిగిన సమావేశంలోనూ కీలక రేట్ల జోలికి వెళ్లని ఎంపీసీ వరుసగా రెండోసారి ఎలాంటి మార్పులు చేయకపోవడం విశేషం. చివరిసారి ఆగస్టులో పావు శాతం కోత విధించింది.

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాల్గో త్రైమాసికాలకు ద్రవ్యోల్బణం 4.3 నుంచి 4.7శాతం ఉంటుందని పరపతి విధాన కమిటీ అంచనా వేసింది. కాగా, వృద్ధి రేటులో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.7శాతంగా ఉంటుందని ఆర్బీఐ గతంలో అంచనా వేసిన విషయం తెలిసిందే.
తాజా సమావేశంలోనూ అదే రేటును పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న సంస్కరణలతో వృద్ధిరేటు అంచనాను చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. 2018 ఫిబ్రవరి 6, 7 తేదీల్లో చివరి ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్ష జరగనుంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు ప్రస్తుతం ఇలా ఉన్నాయి రెపో రేటు - 6శాతం కాగా, రివర్స్ రెపో రేటు - 5.75శాతంగా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్) రేటు- 6.25శాతం, బ్యాంకు రేటు - 6.25శాతంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications