రూ. 2000నోట్ల సరఫరాను తగ్గించేసిన ఆర్బీఐ: రూ.500పైనే దృష్టి
పెద్ద నోట్ల రద్దు అనంతరం విడుదల చేసిన రూ.2000 నోట్ల కొరత ఏర్పడింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోట్ల సరఫరాను తగ్గించేయడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ముంబై: పెద్ద నోట్ల రద్దు అనంతరం విడుదల చేసిన రూ.2000 నోట్ల కొరత ఏర్పడింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోట్ల సరఫరాను తగ్గించేయడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొన్ని వారాల నుంచి రూ. 2000 నోట్ల సరఫరా పడిపోయినట్లు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.
రూ.2000 నోట్ల సరఫరాను తగ్గించిన ఆర్బీఐ.. ఎక్కువగా కొత్త రూ. 500 నోట్ల సరఫరాపై దృష్టి సారించినట్లు ఈ కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం ఎక్కువగా రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ. 500 నోట్లే వస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ వ్యాస్ తెలిపారు.
కేవలం రూ.2000నోట్ల ను రీసర్క్యూలేషన్ కిందనే తిరిగి మళ్లీ తమ దగ్గరకు వస్తున్నాయని, కొత్తగా ఆర్బీఐ నుంచి ఏమీ రావడం లేదని చెప్పారు. ప్రతీ ఏటీఎంలో నగదును స్టోర్ చేయడానికి నాలుగు క్యాసెట్లు ఉంటాయని, ఒక వేళ ఒక క్యాసెట్ రూ. 2000 నోట్లను కలిగి ఉంటే.. ఆ మొత్తం రూ. 60లక్షల వరకు ఉంటుందని తెలిసింది.
ఒక వేళ ఆ క్యాసెట్ను రూ.500 నోట్లతో నింపితే.. మెషిన్ సామర్థ్యం రూ. 25లక్షలకు పడిపోతుందని వెల్లడైంది. కానీ, కష్టమర్లకు రూ. 500 నోట్ల వల్ల చిల్లర సమస్య పెద్దగా తలెత్తే అవకాశం ఉండదు. కాగా, త్వరలోనే రూ.200నోట్లను కూడా ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొస్తుందని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ నోట్లను ఏటీఎంల ద్వారా అందించే అవకాశాలు లేవని తెలుస్తోంది.