ఆర్ బీఐ అధికారి కక్కుర్తి: రూ. 1.50 కోట్లు గోల్ మాల్, అరెస్టు
బెంగళూరు: రిజర్వ్ బ్యాంకు (ఆర్ బీఐ) సీనియర్ అధికారి కమీషన్ కు కక్కుర్తిపడి రూ. కొటిన్నర విలువైన కొత్తనోట్లను దారి మళ్లించి అడ్డంగా బుక్కయ్యాడు. బెంగళూరులోని రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యలయంలో ప్రత్యేక సహాయక సీనియర్ అధికారిగా పని చేస్తున్న కే. మైఖేల్ కట్టూ కరణ్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
మైఖేల్ నుంచి రూ. 17 లక్షలు (కమీషన్ డబ్బు) స్వాధీనం చేసుకున్నారు. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెకు చెందిన వ్యాపారవేత్త, జేడీ (ఎస్) నాయకుడు కె.సి. వీరేంద్రను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు అరెస్టు చేసి అతని నుంచి వివరాలు సేకరించారు. ఆర్ బీఐ అధికారి మైఖేల్ మీద సీబీఐ అధికారులకు అనుమానం వచ్చింది.
సీబీఐ అదుపులో బాత్ రూంలో భోషాణం కింగ్
ఓ నగల వ్యాపారి నుంచి రూ. 1,000, రూ. 500 పాత నోట్లు తీసుకున్న మైకెల్ కమీషన్ కు కక్కుర్తిపడి రూ. 1.51 కోట్ల విలువైన రూ. 2,000 కొత్త నోట్లు ఇచ్చాడని సీబీఐ అధికారులు గుర్తించారు. డిసెంబర్ 2వ తేదిన సీబీఐ అధికారులు మొదటి సారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దర్యాప్తు తరువాత ఆర్ బీఐ అధికారి మైఖేల్ మీద నేరం రుజువు అయ్యింది. కోళ్లేగాళ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు బ్యాంకు క్యాషియర్ దగ్గర నుంచి నగల వ్యాపారి రూ. 2,000 కొత్త నోట్లు తీసుకున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
నేరం చేసినట్లు మైఖేల్ అంగీకరించడంతో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. ఒక క్యాసినో యజమాని బాత్ రూంలో రూ. 5.70 కోట్ల రూ. 2,000 కొత్త నోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు జేడీ(ఎస్) నేత వీరేంద్రను అరెస్టు చేశారు. అతను చెప్పిన వివరాల ఆధారంగా బ్యాంకు అధికారులు, ఉద్యోగుల మీద కేసులు నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.