ఆ రుణాలపై వడ్డీ మోత, ఫిక్స్డ్ డిపాజిట్స్కు హ్యాపీస్ కారణం ఇదే..!
ముంబై: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ కావొచ్చు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నవారికి మాత్రం కచ్చితంగా గుడ్ న్యూసే అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందంటూ చిన్న లీకులు ఇచ్చింది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరుగుతాయని చెప్పిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దీనిపై కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన సీనియర్ సిటిజెన్స్కు తక్కువ వడ్డీ రావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇకపై వారికి ఆ సమస్య ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే గృహరుణాలు, వాహనాల కోసం రుణాలు, వ్యక్తిగత లోన్, విద్యారుణాలపై మాత్రం వడ్డీ పెరుగుతుందని సంకేతాలు ఇచ్చింది ఆర్బీఐ.
కరోనావైరస్కు ముందున్న సీఆర్ఆర్
పాలసీ రేట్లపై స్పష్టత ఇవ్వనప్పటికీ... కరోనావైరస్ రాకమునుపు సీఆర్ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో) ఎలా ఉన్నిందో తిరిగి ఆ రేట్లను అమలు చేసే యోచనలో ఆర్బీఐ ఉంది. ఇలా సీఆర్ఆర్ను పెంచడమంటే బ్యాంకుల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. దీంతో వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది. ఇక చాలా సింపుల్గా చెప్పాలంటే బ్యాంకుల వద్ద తక్కువ నగదు ఉంటున్నందున ఒత్తిడి పెరిగి ఆ భారం వడ్డీ రూపంలో వసూలు చేస్తుంది. అంటే ఒకవేళ రుణాలకు కస్టమర్ల నుంచి డిమాండ్ పెరిగినట్లయితే డబ్బులు తక్కువగా ఉన్నందున రుణాలు ఇచ్చి దానిపై వడ్డీ ఎక్కువగా వసూలు చేస్తాయి బ్యాంకులు.
రెండు దశల్లో సీఆర్ఆర్ పెంపు
ఇక సీఆర్ఆర్ను ప్రస్తుతం ఉన్న 3శాతం నుంచి 4శాతంకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.ఇది రానున్న నాలుగు నెలల్లో జరుగుతుందని సంకేతాలిచ్చింది. రెండు దశల్లో సీఆర్ఆర్ పెంచడం జరుగుతుందని ఆర్బీఐ వివరించింది. తొలి దశలో భాగంగా 27 మార్చి 2021న సీఆర్ఆర్ను 3.5శాతంగా పెంచి రెండో దశ అంటే మే 22వ తేదీన 4శాతంకు సీఆర్ఆర్ను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 2013 నుంచి జనవరి 2020 వరకు సీఆర్ఆర్ 4శాతంగా ఉన్నింది. ఆ తర్వాత కరోనా దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడంతో సీఆర్ఆర్ 3శాతంకు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
వ్యవస్థలో నగదు ప్రవాహం కోసం కృషి
సీఆర్ఆర్ 4శాతంగా ఉన్న సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు ఫిబ్రవరి 2020లో 6శాతంగా ఉండేది. మే నెలలో సీఆర్ఆర్,రెపో రేట్లను పునసమీక్షించిన తర్వాత వడ్డీ రేటు 5.4శాతానికి పడిపోయింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు రుణంగా తీసుకోవాలని భావిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే నగదు ప్రవాహంకు ఢోకా ఉండదు. అంతేకాదు అవసరమైతే ఆర్బీఐ కూడా వ్యవస్థలోకి నగదు ప్రవాహం జరిగేలా సహకరిస్తుందనే సంకేతాలు ఇచ్చింది. ఇక సీఆర్ఆర్ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడంతో మార్కెట్ల కార్యకలాపాల్లో వేగం పుంజుకుంటుందని ఆర్బీఐ బాస్ శక్తికాంతా దాస్ చెప్పారు.