జైట్లీ ఊరట: రూ.5000 నోట్ల డిపాజిట్పై తగ్గిన కేంద్రం, ప్రశ్నలుండవు
రెండు రోజుల క్రితం ఆర్బీఐ రూ.5వేలకు మించి ఉంటే డిసెంబర్ 30వ తేదీలోపు ఒకేసారి బ్యాంకులో జమ చేయాలని షరతు విధించింది. దానిని ఇప్పుడు ఉపసంహరించుకుంది.
ముంబై: నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రూ.5వేల కంటే ఎక్కువ పాత నోట్లు ఉన్న వారు డిసెంబర్ 30వ తేదీలోపు ఒకేసారి డిపాజిట్ చేయాలని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది సామాన్యులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఇప్పుడు దీని పైన రిజర్వ్ బ్యాంకు వెనక్కి తగ్గింది. డిసెంబర్ 19వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
కేవైసీ సమాచారం ఉన్న ఖాతాదారులు బ్యాంకు అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాల్సిన అవసరం లేకుండానే నగదు జమ చేసేందుకు అనుమతి ఇచ్చింది. రూ.5వేలు పైబడి మొత్తాలను ఒక్కసారి మాత్రమే జమ చేయాలన్న నిబంధన కూడా కేవైసీ వివరాలు ఉన్న ఖాతాలకు వర్తించదు.
అయితే, కేవైసీకి అనుగుణంగా లేని ఖాతాలకు మాత్రం ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పింది. పాతనోట్లను డిపాజిట్ చేస్తున్న వారిని ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో బ్యాంకు అధికారులు ప్రశ్నించాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, మంగళవారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.5000 పైన డిపాజిట్ పైన స్పందించారు. రద్దయిన పాత నోట్లను ఒక్కసారే ఎంతమొత్తంలోనైనా జమ చేయవచ్చని, అలాంటి డిపాజిట్లపై బ్యాంకు అధికారులు ఎలాంటి ప్రశ్నలూ వేయరని జైట్లీ మంగళవారం నాడు ఇచ్చారు.

అలా కాకుండా రోజుకు ఇంతని చొప్పున మళ్లీ మళ్లీ డిపాజిట్ చేస్తేనే అనుమానించాల్సి వస్తుందన్నారు. డిసెంబరు 15 దాకా పాత నోట్లను పలురకాల చెల్లింపులకు అనుమతించినందున రోజూ పాత నోట్లు జమ చేసినా ఎలాంటి అనుమానం వచ్చేది కాదని, ఇప్పుడు ఆ మినహాయింపులన్నీ బంద్ అయినందున రోజూ కొంత మొత్తం చొప్పున ఒకే ఖాతాలో పాత నోట్లు జమ చేస్తే.. ఆ నోట్లు రోజూ ఎక్కడి నుంచి వస్తున్నాయనే అనుమానం వస్తుందన్నారు.
అలాగే, నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఎదురయ్యే నగదు కొరతను ఎదుర్కొనడానికి రిజర్వు బ్యాంకు పూర్తి సన్నద్ధతతో ఉందని జైట్లీ స్పష్టం చేశారు. కేవలం డిసెంబరు 30 దాకా కావాల్సినంత మేరకే కాక ఆ తర్వాత అవసరమయ్యే నగదు సైతం ఆర్బీఐ వద్ద సిద్ధంగా ఉందన్నారు.
నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత బ్యాంకులకు ఆర్బీఐ తగినంత నగదును సరఫరా చేయని రోజు ఒక్కటి కూడా లేదన్నారు.
దేశంలో చలామణీలో ఉన్న నగదు వివరాల గురించి ప్రశ్నించగా.. డిసెంబరు 30 నాటికి పాత నోట్ల డిపాజిట్లు ముగుస్తాయని, ఆ తర్వాత కచ్చితంగా లెక్కించాకే ఆ విషయమై గణాంకాలను వెల్లడి చేస్తామన్నారు.
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత క్రెడిట్/డెబిట్ కార్డుల వాడకం గణనీయంగా పెరిగిందన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ వృద్ధి 300 శాతం దాకా ఉందన్నారు. డిజిటల్ లావాదేవీలు బాగా తక్కువగా ఉన్నచోట్ల 1500 శాతం కూడా ఉందన్నారు.
ఇంకా తమ వద్ద పాత నోట్లు ఉన్నవారు వాటన్నిటినీ ఒకేసారి బ్యాంకుల్లో జమ చేయాలని, పదేపదే జమ చేస్తే అనుమానించాల్సి వస్తుందని పునరుద్ఘాటించారు. అలాగే ఐటీ శ్లాబులపై నిర్ణయం తీసుకున్నాకే ప్రభుత్వం దానిపై ప్రకటన చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications