నా మృతదేహంపై కాషాయజెండా: ‘జామియా’ షూటర్ రామ్భక్త్ గోపాల్ బ్యాక్గ్రౌండ్ ఇదీ!
న్యూఢిల్లీ: అతని పేరు రామ్భక్త్ గోపాల్ శర్మ. వయస్సు 19 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్లోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలోని జెవర్ ప్రాంతానికి చెందిన యువకుడు. దేశ రాజధానికి ఆనుకుని ఉండే జిల్లా ఇది. ప్రస్తుతం గోపాల్ శర్మ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్రబిందువుగా మారింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో అతని పేరు రాజకీయ పార్టీలకు ఓ ప్రచార అస్త్రంగా కూడా మారింది.
అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను నిజం చేశారు: ఢిల్లీ ఎన్నికల వాయిదా కోసం బీజేపీ కుట్ర: ఆప్, సీపీఐ..!
వందలాది మంది విద్యార్థులపై తుపాకీ ఎక్కుపెట్టి..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా న్యూఢిల్లీలో భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టిన జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు, ఇతర ఆందోళనకారులపై తుపాకీతో కాల్పులు జరపడంతో గోపాల్ శర్మ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అతని వెనుక భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నట్లు అటు కాంగ్రెస్, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ధ్వజమెత్తుతున్నాయి.
పౌరసత్వ నిరసనలపై ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టులు..
రామ్భక్త్ గోపాల్ శర్మ పేరు వెలుగులోకి రాగానే.. అతనికి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై పోలీసులు నిఘా వేశారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అతని ఫేస్బుక్ అకౌంట్లో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నట్లు ఢిల్లీ పోలసులు గుర్తించారు. గణతంత్ర దినోత్సవం నుంచీ ఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద నిరవధికంగా కొనసాగుతున్న నిరసన దీక్షలపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను చేసినట్లు తేలింది.
షహీన్ బాగ్ ఖేల్ ఖతం అంటూ..
షహీన్ బాగ్ ఖేల్ ఖతం అనే కామెంట్లు పెట్టాడని నిర్ధారించారు. దీనితోపాటు- `నా అంతిమయాత్రపై కాషాయజెండా కప్పాలని, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయాలనే కామెంట్లను కూడా పెట్టాడు రామ్భక్త్ గోపాల్ శర్మ. ఆ వ్యాఖ్యలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన రెండు గంటల తరువాత గోపాల్ శర్మ.. న్యూఢిల్లీకి వచ్చాడని, జామియా విద్యార్థుల ప్రదర్శనపై కాల్పులు జరిపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం గోపాల్ శర్మ ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడు.
బీజేపీ హస్తం ఉందంటూ..
ఈ కాల్పుల ఘటన కాస్తా దేశ రాజధానిలో రాజకీయ వేడిని మరింత రగిల్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో పట్టపగలు, అదీ విద్యార్థులపై చోటు చేసుకున్న ఈ కాల్పుల ఉదంతాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకుంది. గోపాల్ శర్మ వెనుక బీజేపీ హస్తం ఉందని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్షా ప్రమేయం ఉందంటూ ఆరోపణలను గుప్పిస్తున్నారు ఆప్ నాయకులు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతోంది.