ఉరికి సిద్ధం: మాటపై వెనక్కి తగ్గని సాక్షి మహారాజ్
న్యూఢిల్లీ: ఒక్కో హిందూ మహిళ నలుగురు పిల్లలను కనాలని తాను చేసిన వ్యాఖ్యలపై బిజెపి పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. తాను తప్పు మాట్లాడితే ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన గురువారంనాడు అన్నారు. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
విషయాన్ని మీడియా సాగదీస్తోందని, ఈ విషయంపై తాను ఇదివరకే చాలాసార్లు మాట్లాడానని, దాన్ని మరిచిపోవడం మంచిదని, తాను ఆ విషయాన్ని రాజకీయ వేదికపై నుంచి మాట్లాడలేదని ఆయన అన్నారు. తన ప్రకటనతో ప్రజలు బాధపడితే, దాన్ని కట్టడి చేయాలని, అప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లల కన్నా ఎక్కువ ఉన్న వారికి వ్యతిరేకంగా చట్టం తేవాలని ఆయన అన్నారు.
తాను తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే తను ఉరికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఓ వార్తా సంస్థతో అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. చట్టం అందరికీ సమానంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. మంచి మాటలు చెప్పినప్పుడు మీడియా పట్టించుకోదని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ తనకు చెందినవాడు, తాను ఆయనకు చెందినవాడిని అని సాక్షి మహరాజ్ అన్నారు. తాను మోడీ సైనికుడినని, తాను బిజెపి సైనికుడిని అని ఆయన అన్నారు.
మంగళవారంనాడు సంత్ సమాగమమ్ మహోత్సవంలో మాట్లాడుతూ సాక్షి మహరాజ్ - హిందూ మహిళలు ఒక్కరొక్కరు నలుగురేసి పిల్లలను కనాలని అన్నారు. భారతదేశంలో నలుగురు భార్యలు, 40 మంది పిల్లలు అనే దృష్టి కోణం పనికి రాదని ఆయన అన్నారు. హిందూ మతాన్ని రక్షించడానికి హిందూ మహిళలు నలుగురేసి పిల్లలను కనాలని అన్నారు. గతంలో నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించి ఆయన వివాదం సృష్టించారు.