మోడీ! హ్యాట్సాప్, ఆ తర్వాత మీ ఇష్టం: వెంకయ్య, క్యూలో నిల్చున్న రాహుల్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు రాజ్యసభలో మాట్లాడారు. బ్లాక్ మనీ నిర్మూలించడంలో కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పారు. తాత్కాలిక ఇబ్బందులున్నా భవిష్యత్తులో మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూనే ఉన్నారన్నారు.
ప్రజలు కూడా ఈ నిర్ణయన్ని స్వీకరిస్తున్నారని చెప్పారు. నోట్ల రద్దుపై అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారని, ముందుగానే చెబితే బ్లాక్ మనీ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోరా అని నిలదీశారు. అజెండాలో వెల్లడించిన ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.
నల్లధనాన్ని శాశ్వతంగా నిర్మూలిస్తామన్నారు. విపక్షం అపోహల నుంచి బయటకు రావాలన్నారు. ఇది మహాయజ్ఞమని, దీనికి అందరూ సహకరించాలన్నారు. డిసెంబరు 30లోగా నల్లధనం, అక్రమ సంపాదన వివరాలు వెల్లడించాలన్నారు. డిసెంబరు 30తర్వాత ఇబ్బందులు పడకూడదన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీకి హ్యాట్సాప్ అన్నారు.
ముంబైలో రాహుల్ గాంధీ
పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకొనేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం నాడు ముంబై వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్లోని ఎస్బీఐ శాఖ వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలో నిలబడి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ రోజు ముంబైలోని వకోలాలో ఎస్బీఐ ఏటీఎం వద్ద క్యూలైన్లో నిలబడ్డారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక, ఏర్పాట్లు లేకుండానే మోడీ నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు.
నోట్ల మార్పిడికి ప్రజలు పడుతున్న అవస్థలను వివరించారు. బ్యాంకుల ఏటీఎంల వద్ద తాగునీరు కూడా లేదన్నారు. ప్రజలకు తోడ్పాటునందించే దిశగా చర్యలు చేపట్టాలని మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కోరారు.
కాగా, తనపై ఆరెస్సెస్ వేసిన పరువు నష్టం కేసులో బీవండి కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు రాహుల్ మంగళవారం రాత్రి ముంబైకి వచ్చారు. అయితే ఈ కేసులో రాహుల్కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.