farmers protest: ఎప్పుడైనా చర్చలకు సిద్ధమన్న తోమర్ -పార్లమెంట్ ముట్టడి యోచనలో టికాయత్
వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు చేస్తోన్న నిరసనలు గురువారంతో 92రోజులు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే హింస తర్వాత రైతు సంఘాలతో కేంద్ర సర్కారు చర్చల ప్రక్రియ నిలిచిపోవడం, ఉద్యమాన్ని దేశమంతటికీ విస్తరించేలా నేతలు వరుసగా కిసాన్ పంచాయితీలు నిర్వహిస్తున్న తరుణంలో కేంద్ర సర్కారు మరో కీలక ప్రకటన చేసింది..
కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం ఎప్పుడైనా సిద్ధమేనని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. సాగు చట్టాలపై నిరసనలు కొనసాగిస్తున్న రైతులతో ఇప్పటికే 12 విడతలుగా చర్చలు జరిపినట్టు ఆయన గుర్తుచేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా,

కొత్త వ్యవసాయ చట్టాలు పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ, ఇంకా అమలులోకి రాలేదని, వాటి అమలుకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, అందువల్ల ఈ చట్టాలను అమలు చేయలేమమని తోమర్ అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉందని తెలిపారు. మరోవైపు..
కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని, ఈ విషయంలో రాజీకి తావులేదని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోకపోతే, పార్లమెంట్ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ ఆవరణ, దాని పరిధిలోని పచ్చిక బయళ్లలో రైతులు వ్యవసాయ కలాపాలు చేపట్టేలా ఆలోచనలు చేస్తున్నామని టికాయత్ చెప్పారు.












Click it and Unblock the Notifications