సచిన్‌ తెందుల్కర్, నయనతార, రమ్యకృష్ణల చేతిలో హైదరాబాద్‌లోని చెరువు శిఖం భూములు -ప్రెస్ రివ్యూ

నయనతార

ఆదిత్యా హోమ్స్‌ సంస్థ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ కుటుంబానికి అక్రమంగా చెరువు శిఖం భూములు అమ్మిందని స్వయంగా ఆ సంస్థ డైరక్టర్‌ సుధీర్‌రెడ్డి ఆరోపించినట్లు ఈనాడు ఒక కథనం రాసింది.

ఆదిత్య హోమ్స్‌ సచిన్‌తోపాటు, నటులు రమ్యకృష్ణ, నయనతార సహా పలువురు ఎంపీలకు ఇలా చెరువు శిఖం భూములను అక్రమంగా కట్టబెట్టినట్లు ఆయన ఆరోపించారని ఈ కథనం పేర్కొంది. ఇటీవల ఆదిత్య హోమ్స్‌ భాగస్వామ్యుల మధ్య ఏర్పడ్డ విభేదాలు పోలీస్‌స్టేషన్‌ వరకు చేరాయి.

ఈ నేపథ్యంలోనే సుధీర్‌రెడ్డి ప్రెస్ మీట్‌ పెట్టారు. 2008లో క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌, ఆయన భార్య అంజలీ తెందుల్కర్‌కు సంస్థ రంగారెడ్డి జిల్లాలో 6.50 ఎకరాల భూమిని అమ్మిందని, అయితే, అవి రావిర్యాల చెరువు శిఖంలో ఉన్నాయని, చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ పరిధిలో ఉన్నాయని తెలిసినా మోసపూరితంగా అమ్మారని ఆయన ఆరోపించారు.

అదే సంవత్సరం నటి నయనతార, రమ్యకృష్ణలకు కూడా చెరో ఎకరం భూమిని ఇలా అక్రమంగా, మోసపూరితంగా ఆదిత్యా హోమ్స్‌ అంటగట్టారని ఆయన ఆరోపించినట్లు ఈ కథనం వెల్లడించింది.

వేపచెట్టు కింద పుదుచ్చేరి అసెంబ్లీ

శనివారంనాడు సమావేశమైన పుదుచ్చేరి శాసనసభ, కరోనా భయం కారణంగా అసెంబ్లీ ఆవరణలోని చెట్ల కింద సాగిందని ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది.

ఈ కథనం ప్రకారం శుక్రవారం సాయంత్రం విపక్ష ఎన్‌.ఆర్‌.కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జయబాల్‌కు కరోనా సోకిందని తెలియడంతో శానిటైజ్‌ చేసేందుకు శనివారంనాడు అసెంబ్లీ హాల్‌ను మూసేశారు. సమావేశాలు జరపక తప్పని స్థితి ఉండటంతో అధికారులు వెంటనే కుర్చీలు, టేబుళ్లు, తెప్పించి అసెంబ్లీ ఆవరణలో ఉన్న వేపచెట్టు కింద సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

ఆరు బయట అసెంబ్లీ జరగడం ఇదే తొలిసారి. మొదట అసెంబ్లీ భవనం మొదటి అంతస్తులో సమావేశం జరపాలని భావించినా, అది ఇరుకుగా ఉందని తేలడంతో అధికారులు ఇలా ఆరు బయట ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ద్రవ్య వినిమయ బిల్లును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టగా, సభ్యులు దానికి ఆమోదం తెలిపారు. తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది.

జోగులాంబ గద్వాల

కరోనా టెస్ట్‌ భయం - కారులో యువతి గల్లంతు

కరోనా టెస్టులను తప్పించుకోడానికి యువజంట చేసిన ప్రయత్నం వారి ప్రాణాలు మీదకు తెచ్చిందని సాక్షి, ఈనాడుతోపాటు పలు పత్రికలు కథనాన్ని ఇచ్చాయి.

వీటి ప్రకారం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న శివశంకర్‌రెడ్డి తన భార్య నాగసింధుతోపాటు, ఓ స్నేహితుడితో కలిసి కారులో హైదరాబాద్‌ వస్తున్నారు. జాతీయ రహదారి మీదుగా వెళితే కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందని భయపడి, గ్రామాల మీదుగా ప్రయాణించే ప్రయత్నం చేశారు.

జోగులాంబ జిల్లాలో ప్రవేశించిన ఈ ముగ్గురు కలుగొట్ల అనే గ్రామం వద్ద ఒక వాగును దాటడానికి ప్రయత్నించారు. అయితే ఉదయం 5 గంటల సమయం కావడంతో వాగు ఉధృతిని అంచనా వేయలేకపోయిన వీరు, అలాగే ముందుకు సాగడంతో కారు వాగు మధ్యలో ఆగిపోయింది. ముందు సీట్లో ఉన్న శివశంకర్‌రెడ్డి, అతని మిత్రుడు వెంటనే బయటకు రాగలిగారు. వెనక సీట్లో నిద్రపోతున్న నాగసింధును నిద్ర లేపేలోగానే కారు వాగులో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

కారును గుర్తించగలిగినా అందులో ఉన్న యువతి ఆచూకీ మాత్రం దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాగసింధు గర్భిణి అని, తన కూతురు హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైందని ఆమె తండ్రి వెల్లడించినట్లు సాక్షి పత్రిక తెలిపింది.

రేషన్ దుకాణం

ఏపీలో రేషన్‌ కార్డే ఆదాయం సర్టిఫికెట్‌ -కాలపరిమితి నాలుగేళ్లు

ఇకపై ప్రత్యేకంగా ఆదాయ ధ్రువపత్రాలు ఉండవని, రేషన్‌ కార్డులే ఇన్‌కమ్‌ సర్టిఫికెట్లుగా గుర్తిస్తామని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, రెవిన్యూ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్‌ వెల్లడించినట్లు ఆంధ్రప్రభ ఒక కథనం ఇచ్చింది. ఈ మేరకు కీలకమైన ఉత్వర్వులపై మంత్రి సంతకం చేశారు.

ఈ కార్డు కాల పరిమితిని ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. కాలపరిమితి పెంపువల్ల పదేపదే రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు.

ఆగస్టు 15న రాష్ట్రంలో 30 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇస్తామని కూడా మంత్రి వెల్లడించారు. రెవిన్యూశాఖలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+