పన్నీరు ధైర్యమేమిటి: శశికళపై తిరుగుబాటుకు కారణాలివే...
అమ్మకు మాదిరిగానే చిన్నమ్మకు కూడా వీర విధేయుడిగా ఉంటారని భావించిన పన్నీర్ సెల్వం అకస్మాత్తుగా శశికళపై తిరుగుబాటు ప్రకటించారు. దీనికి కారణాలేమిటి....
చెన్నై: అమ్మకు మాదిరిగానే చిన్నమ్మకు కూడా నమ్మినబంటుగా ఉంటారని భావించిన తమిళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఒక్కసారిగా తిరుగుబాటు ప్రకటించారు. శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురేశారు. అమ్మ సమాధి వద్ద ధ్యానం చేసిన తర్వాత తనకు అన్ని విషయాలూ తెలిశాయని ఆయన ప్రకటించారు.
శశికళపై తిరుబాటు చేయడానికి ఆయనకు ఉన్న ధైర్యమేమిటనేది మొదటి ప్రశ్న. తిరుగుబాటు చేయాలని ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకున్నారా, లేదంటే ఆయన వెనక కేంద్ర ప్రభుత్వం ఉందా అనేది రెండో ప్రశ్న. డిఎంకె ఆయనకు హామీ ఇచ్చిందా అనేది మరో ప్రశ్న.
శశికళకు పన్నీర్ రూపంలో జల్లికట్టు 2
శశికళతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించకుండా గవర్నర్ జాప్యం చేయడానికి కారణాలు ఏమిటనేది మరో ప్రశ్న. శశికళ ప్రతి అడుగుకు మద్దతు తెలుపుతూ వచ్చిన పన్నీర్ సెల్వం ఈ తెగువ ప్రదర్శించడం వెనక ఇతరేతర శక్తులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శశికళకు ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. తాను పది శాతం నిజాలు మాత్రమే చెప్పానని, మిగతా 90 శాతం వాస్తవాలు తనతో చెప్పించవద్దని ఆయన అన్నారు. ఆయన అకస్మాత్తుగా తిరుగుబాటు చేయాలనే నిర్ణయం తీసుకుని దాన్ని అమలులోకి తేవడం వెనక ఐదు కారణాలు ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
జయ మరణం తర్వాత శశికళ వైఖరిపై అసంతృప్తి
జయలలిత మరణించిన తర్వాత శశికళ వైఖరిపై పన్నీర్ సెల్వం తీవ్ర అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు. పేరుకు మాత్రమే తాను ముఖ్యమంత్రి అని, షాడో సీఎంగా శశి జోక్యం చేసుకున్నారని ఆయన భావించినట్లు సమాచారం. తనను శశికళ ఎన్నో సార్లు అవమానించారని పన్నీరు సెల్వం తనకు అత్యంత సన్నిహితులైనవారి వద్ద చెబుకున్నట్లు సమాచారం. అయితే అసంతృప్లిని ఎప్పుడూ సెల్వం బయట పెట్టకపోవడం విశేషం.
సెల్వం ధైర్యానికి ఇదో కారణం..
మంగళవారం అన్నాడియంకె నాయకులు కొంత మంది అనూహ్యంగా శశికళ ప్రవర్తనపై విరుచుకుపడ్డారు. జయ మరణానికి శశి కారణమని పాండియన్ వంటి నేతలు విమర్శలు చేయడంతో సెల్వం ధైర్యం చేశారని అంటున్నారు. అయితే, అది పన్నీర్ సెల్వం వేసే అడుగులో భాగంగానే వ్యూహాత్మకంగా జరిగిందనే అభిప్రాయం కూడా ఉంది. పరిస్థితిని తిరుగుబాటుకు అనుకూలంగా మలుచుకోవడానికి అది ఉపయోగపడిందని చెబుతున్నారు.
సుప్రీంకోర్టు ప్రకటన కూడా ధైర్యమిచ్చింది..
శశికళ అక్రమాస్తుల కేసులో త్వరలో తీర్పు వెల్లడిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. జయలలిత కూడా నిందితురాలుగా ఉన్న ఈ కేసులో శశికళపై తీర్పు వెలువరించడానికి సుప్రీంకోర్టు సంసిద్ధం కావడం పన్నీరు సెల్వాన్ని తిరుగుబాటుకు ఉసిగొలిపిన కారణాల్లో ఒకటని అంటున్నారు. దాని వల్లనే మంగళవారంనాడు జరగాల్సిన శశికళ ప్రమాణస్వీకారం రద్దయింది. దాంతో చిన్నమ్మ వైఖరిపై కేంద్రం సానుకూలంగా లేదనే వార్తలు వచ్చాయి.
జయను చూసే అవకాశం పన్నీరుకు రాలేదు..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అమ్మను చూసే అవకాశం పన్నీరు సెల్వంకు రాకుండా శశికళ చూశారని అంటున్నారు. అమ్మ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఆయనకు దానివల్ల అవకాశం రాలేదు. సెల్వం తిరుగుబాటు చేయడానికి ఇది మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు. జయలలిత ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని కూడా తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వంకు తెలియజేయలేదు.ఇది ఆయనను తీవ్రంగా బాధించిందని అంటున్నారు.
జయకు నమ్మిన బంటు కావడం...
జయలలితకు వీర విధేయుడుగా పన్నీరు సెల్వంకు మంచి రికార్డు ఉంది. ముఖ్యమంత్రిగా పని చేసింది కొద్ది కాలమైనా జల్లికట్టు, వార్ధ తుపాన్ సమయాల్లో సమర్థవంతంగా పనిచేయడంతో పన్నీర్ సెల్వానికి ప్రజల్లో మద్దతు పెరిగింది. జయలలిత మరణం తర్వాత ఆయన సమర్థతకు గుర్తింపు వచ్చింది. శశికళ ముఖ్యమంత్రి పీఠం కోసం పాకులాడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లడం కూడా ఆయనకు కలిసి వచ్చింది.