దండ: పాక్, చైనా ఆక్రమణభూమిపై మోడీకి ములాయం
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్, చైనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటాన్ని సమాజ్వాది పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ ప్రశంసించారు. అయితే, చైనా, పాకిస్తాన్లు స్వాధీనం చేసుకున్న భారత్ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటే తాను మోడీ మెడలో పూలదండ వేస్తానని ములాయం చెప్పారు.
మాయిన్పురి లోకసభ స్థానం ఉపఎన్నిక సందర్భంగా ఇటావాలోని రాంలీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. పాకిస్థాన్, చైనా దేశాలు ఆక్రమించిన మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోగలిగితే మోడీని అభినందించడమే కాదు, మెడలో హారం కూడా వేస్తానన్నారు.
ఆ రెండు దేశాలతో సత్సంబంధాలకు మోడీ ప్రయత్నించడాన్ని హర్షిస్తున్నట్లు చెప్పారు. అయితే, చైనా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. చైనా ఈ ప్రపంచంలోనే అతి పెద్ద చీటర్ అని, హిందీ-చీనీ భాయి భాయి అన్న నెహ్రూకే ద్రోహం తలపెట్టారని, ఆ షాక్ తోనే నెహ్రూ మరణించారని, అలాంటి చైనాతో సంబంధాలు పెంపొందించుకోవడంలో మోడీ విజయవంతం కాకపోవచ్చునన్నారు.
అజంఘర్ నుండి వచ్చిన డిమాండ్ నేపథ్యంలో తాను మెయిన్పురిని వదులుకున్నానని, ఈ స్ధానం నుండి తేజ్ ప్రతాప్ బరిలోకి దింపామని, ఫలితాలు మీ చేతుల్లో ఉందని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు. అంతేకాకుండా.. తాను అజంఘర్ వదిలేస్తే ఆ స్థానంలో బీజేపీ గెలుస్తుందనే భయం కారణంగానే.. మెయిన్పురి ప్రజల పైన నమ్మకంతో ఇక్కడి స్థానాన్ని వదులుకున్నట్లు చెప్పారు.