గాలి పొలిటికల్ రీ-ఎంట్రీ! : బీజేపీ కరుణిస్తుందా..!
బెంగుళూరు : నిన్నటిదాకా కుమార్తె పెళ్లి వివాహంతో దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానిన గాలి జనార్దన్ రెడ్డి పేరు.. ఇకనుంచి రాజకీయాల్లోను క్రియాశీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుమార్తె పెళ్లితో బరువు బాధ్యతలను దించేసుకున్న గాలి.. ఇక తన పొలిటికల్ రీ ఏంట్రీ పైనే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
గత నాలుగైదు నెలల నుంచి కుమార్తె వివాహ పనులతోనే బిజీ బిజీగా గడుపుతున్న గాలి.. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో రాజకీయాల కోసం సమయం వెచ్చించనున్నట్టుగా సమాచారం. గతంలో బీజేపీ మంత్రిగా పనిచేసి.. ఆపై అక్రమ మైనింగ్ ఆరోపణలతో జైలుకి వెళ్లిన గాలి.. అనంతరం బెయిల్ పై బయటకొచ్చినా.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
మధ్యలో బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వంటివి జరిగినప్పటికీ.. ఆ పార్టీ ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రస్తుతం ఆయన చూపు బీజేపీ వైపే ఉన్నప్పటికీ.. ఆయన్ను పార్టీలోకి తీసుకోవడానికి బీజేపీ సుముఖంగా ఉందా? అన్నది అనుమానమే. గాలి కుమార్తె పెళ్లికి సైతం బీజేపీ నేతలను దూరంగా కట్టడి చేయడం ఇందుకు ఊతమిస్తోంది. అయితే గాలి జనార్దన్ రెడ్డి మాత్రం రాజకీయాల్లో తన గత వైభవాన్ని తిరిగి పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీ కరుణిస్తుందా? లేదా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.