తమిళనాడుకు 2వేల క్యూసెక్కుల నీరివ్వాలని కర్ణాటకకు సుప్రీం ఆదేశం
తమిళనాడు రాష్ట్రానికి రెండు వేల క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక రాష్ట్రాన్ని మంగళవారం నాడు ఆదేశించింది.ఈ కేసును జూలై 11వ, తేదికి వాయిదా వేసింది కోర్టు.
న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి రెండు వేల క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక రాష్ట్రాన్ని మంగళవారం నాడు ఆదేశించింది.ఈ కేసును జూలై 11వ, తేదికి వాయిదా వేసింది కోర్టు.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు తమిళనాడు రాష్ట్రానికి రెండువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నాడు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
ఈ కేసుపై రెండు రాష్ట్రాలు తమ రాష్ట్రాల వాదనలను సమర్థించుకొన్నాయి.1892 లో రెండు రాష్ట్రాల మద్య చోటుచేసుకొన్న ఒప్పందాలు చెల్లుబాటు అవుతాయా అనే విషయమై కోర్టు నిర్ణయాన్ని ప్రకటించనుంది. అయితే మైసూర్ రీజియన్ లోని రైతులు పంటలు వేయని సమయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నీటిని వాడుకోవచ్చని 2007 లో ఇచ్చిన ట్రిబ్యునల్ అవార్డును రెండు రాష్ట్రాలు చాలెంజ్ చేశాయి.
ట్రిబ్యునల్ తీర్పుపై రెండు రాష్ట్రాలు చాలెంజ్ చేసినందున సుప్రీంకోర్టు తన తుది తీర్పులో ఈ అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.740 టిఎంసిల నీటిలో కర్ణాటకకు 270 టిఎంసిలు, తమిళనాడుకు 419 టిఎంసిలు, కేరళకు 30 టిఎంసిలు, పాండిచ్చేరికి 7 టిఎంసిలు కేటాయించింది. మరో 7 టిఎంసిలు పర్యావరణ అవసరాల కోసం కేటాయిస్తూ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని వెలువరించింది.అయితే ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు కావేరి నీటి సమస్యపై ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తుది తీర్పును వెలువరించే అవకాశం ఉంది.