జియో దెబ్బ మామూలుగా లేదు.. లక్ష ఉద్యోగాలు అవుట్!..
జియోతో పోటీని ఎదుర్కోనేందుకు టారిఫ్ రేట్స్ ను తగ్గించడం, ఉచితంగా వాయిస్ కాల్స్ అందించడంతో కంపెనీలు నష్టాల బాట పట్టాయి. దీంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఉద్యోగులపై పడుతోంది.
న్యూఢిల్లీ: టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో మిగతా టెలికాం సంస్థల అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. జియో ఇబ్బడి ముబ్బడిగా ప్రకటించిన ఆఫర్లతో కస్టమర్లంతా రిలయన్స్ వైపు క్యూ కట్టడంతో.. పోటీని ఎదుర్కోలేక చాలా టెలికాం సంస్థలు చతికిల పడ్డాయి.
ఇప్పటికీ కొన్ని సంస్థలు జియో పోటీని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నా.. లాభాలు గణనీయంగా తగ్గి నష్టాల బాట పట్టడంతో.. ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో రిలయన్స్ జియో దెబ్బకు వేలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది.
పరిశీలకుల అంచనా ప్రకారం దాదాపు 10లక్షల మంది టెలికాం ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆయా సంస్థలు 3400మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. జియోతో పోటీని ఎదుర్కోనేందుకు టారిఫ్ రేట్స్ ను తగ్గించడం, ఉచితంగా వాయిస్ కాల్స్ అందించడంతో కంపెనీలు నష్టాల బాట పట్టాయి. దీంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఉద్యోగులపై పడుతోంది.
భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు మినహా చిన్న స్థాయి టెలికాం కంపెనీలు పూర్తిగా దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. దీన్నిబట్టి చూస్తే భవిష్యత్తులో భారతీయ టెలికాం రంగంలో మూడు, నాలుగు కంపెనీల కన్నా ఎక్కువ కంపెనీలు నిలదొక్కుకునే అవకాశం కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే, జియో దెబ్బతో గడిచిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశీయ టెలికాం కంపెనీల ఆదాయం రూ.4,900 కోట్లు పడిపోవడం గమనార్హం. గడిచిన ఏడేళ్లలో టెలికాం కంపెనీలకు ఇంత భారీ నష్టం జరగడం ఇదే తొలిసారి. 2015-16లో రూ.1.93 లక్షల కోట్లున్న ఈ కంపెనీల ఆదాయం జియో ఎంట్రీతో 2016-17లో రూ.1.88 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం మరింతగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.