భారత్లో కరోనా కల్లోలానికి అసలు కారణాలివే- అన్నింటా టాప్- డబ్ల్యూహెచ్వో వెల్లడి
భారత్లో కరోనా కల్లోలం అంతకంతకూ తీవ్రమవుతోంది. నిత్యం లక్షల కేసులతో జనం ప్రాణాలు గుప్పిట్టో పెట్టుకుని బతుకుతున్నారు. ఓవైపు టెస్టుల కరవు, మరోవైవు వ్యాక్సిన్ల కొరత తీవ్రమై జనం గత కొన్ని శతాబ్దాల్లో చూడని ఉత్పాతాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్ధ తన వారాంతపు నివేదికలో కరోనా సెకండ్ వేప్కు కారణమవుతున్న వైరస్ రకం భారత్లో తొలిసారి ఎప్పుడు కనిపించింది, దీని వ్యాప్తికి కారణాలు బయటపెట్టింది.
డబ్ల్యూహెచ్వో షాకింగ్ రిపోర్ట్
భారత్లో కల్లోలానికి కారణమవుతున్న సెకండ్వేవ్ వైరస్ బీ1.617 రకంపై ప్రపంచ ఆరోగ్య సంస్ధ తాజాగా ప్రకటించిన వారాంతపు నివేదికలో షాకింగ్ వాస్తవాలు వెల్లడించింది. ఈ వైరస్ భారత్లో ఎప్పుడు గుర్తించారు, ఇంతగా వ్యాప్తి చెందడానికి కారణాలేంటన్న దానిపై డబ్ల్యూహెచ్వో నివేదికలో ఇచ్చిన విశ్లేషణ దేశంలో పాలకుల్ని, వారి విధానాల్ని సైతం తప్పుబట్టేలా ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్నకేంద్రానికి డబ్ల్యూహెచ్వో నివేదిక పుండుమీద కారంగా మారింది.
గత అక్టోబర్లో తొలిసారి వైరస్ గుర్తింపు
ప్రస్తుతం భారత్లో కరోనా సెకండ్వేవ్కు కారణంగా చెప్తున్న బీ1.617 రకం వైరస్ను గతేడాది అక్టోబర్లోనే గుర్తించినట్లు డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. బీ.1.6.17తో పాటు బీ.1.1.7 వంటి వైరస్ రకాలు కూడా భారత్లో ప్రస్తుత కల్లోలానికి కారణంగా గుర్తిస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో తన నివేదికలో తెలిపింది. వీటి వల్లే భారత్లో పరిస్ధితి దారుణంగా తయారైందని ఈ నివేదిక వివరించింది. అలాగే మిగిలిన వేరియంట్లతో పోలిస్తే బీ.1.617.1, బీ.1.617.2 రకం వైరస్లు అత్యంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్వో తన నివేదికలో వెల్లడించింది.
Recommended Video
సెకండ్వేవ్ వెనుక షాకింగ్ రీజన్స్
భారత్లో కరోనా కల్లోలానికి కొన్నిప్రధాన కారణాలను డబ్లూహెచ్వో గుర్తించింది. ఇందులో మతపరమైన, రాజకీయ కారణాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. వీటి వల్లే వైరస్ ఇంత దారుణంగా వ్యాప్తి చెందినట్లు పేర్కొంది. మతపరమైన, రాజకీయ కార్యక్రమాల వల్ల భారీ ఎత్తున ప్రజలు గుమి కూడారని, దీంతో వైరస్ వ్యాప్తి సులువైందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. వీటి గురించి నిర్ధిష్టంగా చెప్పకపోయినా ఇప్పటికే అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్న కుంభమేళా, ఎన్నికల వల్లే సెకండ్ వేవ్ ఇంత దారుణంగా మారిందని డబ్ల్యూహెచ్వో విశ్లేషణ కూడా పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది.
కేసులు, మృతుల్లో భారత్ టాప్
ప్రస్తుతం ఆసియాదేశాల్లో చూసినా, ప్రపంచవ్యాప్తంగా చూసినా కోవిడ్ కేసులు, మృతుల విషయంలో భారత్ టాప్గా నిలుస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ తన తాజా నివేదికలో తెలిపింది. ఆగ్నేయాసియాలో నమోదవుతున్నకేసుల్లో 95 శాతం భారత్లోనే ఉన్నాయని, అలాగే మృతుల్లోనూ 93 శాతం భారత్లోనే ఉంటున్నారని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కొత్త కేసులు, 30 శాతం మరణాలు భారత్లో చోటు చేసుకుంటున్నట్లు తెలిపింది.