సోనియాపై గిరిరాజ్ వ్యాఖ్య: నైజీరియా అసహనం, సారీ చెప్పాలి
న్యూఢిల్లీ: సోనియా గాంధీ తెల్లతోలు వల్లే ఏఐసీసీ అధ్యక్షురాలు అయ్యారని, రాజీవ్ గాంధీ నైజీరియన్ను పెళ్లి చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆమెను అంగీకరించేవారా అన్ని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యల పైన నైజీరియ్ హైకమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నైజీరియా మహిళల గురించి గిరిరాజ్ ప్రస్తావించడం ఆమోదయోగ్యం కాదని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
గిరిరాజ్ తన వ్యాఖ్యలకు జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఒక ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేసింది. బీజేపీ మనస్తత్వాన్ని ఇది ప్రతిబింభిస్తోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
సోనియా, రాహుల్లమీద గిరిరాజ్ వ్యాఖ్యలపై ఏఐసీసీ జాతీయ నాయకులు దుమ్మెత్తిపోశారు. హద్దులు దాటిన ఉన్మాదంతో నోటి దురుసుతో మంత్రి చేసిన అప్రియమైన వాగుడును తీవ్రంగా అసహ్యించుకుంటున్నట్టు ఏఐసీసీ ప్రతినిధి రణ్వీర్ సింగ్ సుర్జేవాలా ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ కనబడకపోవడాన్ని గల్లంతైన మలేషియా విమానంతో పోల్చి గిరిరాజ్ మరో వివాదాన్ని రేకెత్తించారని పలువురు మండిపడుతున్నారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తలంటడంతో గిరిరాజ్ తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం ప్రకటించారు.
లాలూ ప్రసాద్ ఆగ్రహం
గిరిరాజ్ వ్యాఖ్యల పైన ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హుందాతనం పరిధుల్ని దాటి ఆయన మాట్లాడారన్నారు. ఆనకు గాజులు తొడగాలన్నారు. గిరిరాజ్ వ్యాఖ్యలు ఆయనకే పరిమితం కాదని, మొత్తం పార్టీ, ప్రభుత్వ ఆలోచన తీరుకు అవి ప్రతీక అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.
కాగా, గిరిరాజ్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన వ్యాఖ్యలు చేసే ముందు.. మీడియాను ఉద్దేశించి, మీ కెమెరాలు స్విచ్చాఫ్ చేయాలని, ఇతర రికార్డింగ్ వస్తువులను కూడా స్విచ్చాఫ్ చేయాలని సూచించారు. తాను మాట్లాడేది అనధికారికమని చెప్పారని తెలుస్తోంది. తాను ఇప్పుడు చెప్పేది మీడియాలో రావొద్దని చెప్పారని తెలుస్తోంది. తాను అరవింద్ కేజ్రీవాల్లు స్టింగ్లో చిక్కుకోదల్చుకోలేదని చెప్పారని తెలుస్తోంది.