మునుగుతోంది: రేణుక, అర్థం చేసుకోండి: కేకే ఉద్వేగం
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచల రాముడికి చెందిన 900 ఎకరాలు ముంపునకు గురవుతోందని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సోమవారం అన్నారు. రాజ్యసభలో పోలవరం అంశానికి సంబంధించి ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చలో భాగంగా ఆమె మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు 1.89 లక్షల మంది జీవితాలకు సంబంధించిందన్నారు. ముంపు బాధితులకు పూర్తి న్యాయం జరగాలన్నారు. భద్రాచల రాముడికి చెందిన తొమ్మిది వందల ఎకరాలు ముంపునకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేకే ఉద్వేగం
పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని తెరాస ఎంపీ కే కేశవ రావు అన్నారు. అయితే డిజైన్ మార్చాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో ఆర్డినెన్స్ తేవడమేమిటని కేకే ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపాలన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పోలవరం బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఉద్వేగంతో చెప్పారు.
పోలవరం కడితే రెండున్నర లక్షల మంది గిరిజనుల జీవితాలు ఏం కావాలని ప్రశ్నించారు. సభలో అందరూ గిరిజనుల గురించి మాట్లాడినా కేంద్రం పట్టించుకోదా అని ప్రశ్నించారు. గిరిజనుల జీవితాల గురించి ఆలోచించాలని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీలను సంప్రదించిన తర్వాతనే రాష్ట్రాల సరిహద్దులను మార్చాల్సి ఉంటుందన్నారు. పోలవరం డిజైన్ మార్చి రెండు లక్షల గిరిజనులను కాపాడాలన్నారు.
ముంపునకు గురవుతున్న ఏడు మండలాలు తెలంగాణలోనే ఉంచాలన్నారు. రాజకీయ పార్టీలు కేవలం లిప్ సింపతీ మానుకొని, గిరిజనుల గురించి ఆలోచించాలన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి పోలవరం డిజైన్ మార్చాలన్నారు. నాలుగు రాష్ట్రాలను కేంద్రం సంప్రదించాలని కోరారు. నిపుణులతో పోలవరంపై చర్చించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు చట్టం కాదన్నారు. పోలవరం వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.