సూపర్స్టార్పై ఛార్జ్షీట్: ఏ1గా హీరోయిన్
Challenging Star Darshan: ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప కష్టాలు మరింత పెరిగాయి. హత్యకేసులో అరెస్టయిన ఆయన జైలులో రాజభోగాలను అనుభవిస్తోన్నారంటూ వచ్చిన ఆరోపణలు, తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటో, వీడియో కాల్ ఆయన కొంపముంచింది.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్.. ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై దర్శన్ అరెస్ట్ అయ్యారు.

మొన్నటివరకు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొన్నారు. ఈ జైలులో ఆయన రాజభోగాలను అనుభవిస్తోన్నారని, ఓ రిసార్టులో ఉన్నట్లుగా అన్నింటినీ సమకూర్చుకున్నాడనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో.. ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించింది.
ఈ పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. దర్శన్ సహా అతనితో పాటు ఉన్న వారందరినీ కూడా వెంటనే వేర్వేరు జైళ్లకు తరలించాలని ఆదేశించారు. దర్శన్తో పాటు ఇదే కేసులో అరెస్టయిన వారిని రాష్ట్రంలోని ఇతర జైళ్లకు తరలించేలా ఆదేశాలను ఇచ్చారు.
దర్శన్ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే.. పవన్, రాఘవేంద్ర, నందీష్- మైసూరు, జగదీష్, లక్ష్మణ- శివమొగ్గ సెంట్రల్ జైలుకు తరలించాలంటూ ఆదేశాలొచ్చాయి.
ధన్రాజ్- ధార్వాడ, వినయ్- విజయపురా, నాగరాజ్- కలబురగి, ప్రదోష్- బెళగావి, రవి, కార్తీక్, నిఖిల్, కేశవమూర్తి- తుమకూరు సెంట్రల్ జైళ్లకు షిఫ్ట్ చేశారు. మిగిలిన అనుకుమార్, దీపక్ను ప్రస్తుతం ఉన్నచోటే అంటే బెంగళూరు పరప్పన అగ్రహార జైలులోనే కొనసాగించాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు ఇచ్చారు.
రేణుకా స్వామి హత్యకేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు ఛార్జ్షీట్ను ఫైల్ చేశారు. దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మంది పేర్లను ఇందులో చేర్చారు. దీన్ని బెంగళూరులోని 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్కు సమర్పించారు. మొత్తం 3,991 పేజీల ఛార్జ్షీట్ ఇది.
ఇందులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్ పేర్లను నమోదు చేశారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఈ ఛార్జ్షీట్ను కోర్టుకు అందజేసింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలు కూడా ఇందులో ఉన్నాయి.
రేణుక స్వామి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అలాగే- 50 మందికి పైగా పోలీసులు, ఎనిమిది మంది డాక్టర్లు, 97 మంది ఇతర సాక్షుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెక్షన్ 164 సీఆర్పీసీ కింద 27 మంది తమ వాంగ్మూలాలను కోర్టు ముందు నమోదు చేసుకున్నట్లు వివరించారు.
రేణుక స్వామి హత్యకు కుట్ర పన్నడం, దాన్ని అమలు పరచడం, కిడ్నాప్, చిత్రహింసలు పెట్టడం, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, తామే హత్య చేసినట్లుగా నలుగురిని పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రరేపించడం, దీని ద్వారా కేసు దర్యాప్తు, పోలీసులను తప్పుదోవ పట్టించేలా ప్లాన్ చేయడంలో దర్శన్, పవిత్ర గౌడల పాత్ర ఉందని చార్జిషీట్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications