వన్ మ్యాన్ ఆర్మీకి పద్మ అవార్డు: ఆయన ప్రత్యేకత ఏంటీ: ఆసక్తికరం నేపథ్యం
బెంగళూరు: దేశ 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురికి ఈ అవార్డులు వరించాయి. వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకోనున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 128 మందికి పద్మ అవార్డులు లభించాయి. నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.
ఏపీ నుంచి ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. సాహిత్యం, విద్య విభాగం నుంచి ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు, కళలు విభాగం నుంచి గోసవీడు షేక్ హుస్సేన్, మెడిసిన్ నుంచి డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ అవార్డుల కోసం ఎంపిక అయ్యారు. పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి వేర్వేరు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులుకు పద్మ అవార్డులు లభించాయి.
గమక గంధర్వుడు, శివమొగ్గకు చెందిన హెచ్ఆర్ కేశవమూర్తి, ప్రఖ్యాత కవి డాక్టర్ ఎస్ సిద్ధలింగయ్య, ధార్వాడ జిల్లాకు చెందిన రైతు అబ్దుల్ ఖాదర్, దక్షిణ కన్నడకు చెందిన రైతు అమై మహాలింగ నాయక్కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. వారికి పద్మ పురస్కారాలు లభించడం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో అమై మహాలింగ నాయక్కు పద్మశ్రీ అవార్డు వరించడం వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.
యవసాయ రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు కోసం మహాలింగ నాయక్ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసింది?.. ఆయన ప్రత్యేకతలేమిటి? అనే ప్రశ్నల వెనుక ఆసక్తికరమైన సమాధానాలు ఉన్నాయి. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ సమీపంలోని అడ్యనడ్క గ్రామానికి చెందిన రైతు మహాలింగ నాయక్. బోరుబావులను తవ్వకుండా.. గ్రావిటీ ద్వారా తన పంటలకు నీటిని పారించారాయన. దీనికోసం ఒక్కడే సొరంగాలను తవ్వారు.
గ్రావిటీ ద్వారా నీటిని తరలించడానికి అయిదు సొరంగాలను చేతి పనిముట్లతో తవ్వారు. బోరుబావులను తవ్వించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సంప్రదాయపద్ధతుల్లో తన పంటలకు నీరు పారేలా చేశారు. ఎత్తయిన ప్రదేశంలో ఉండే తన పంట పొలాలకు సమాంతరంగా ఈ సొరంగాలను తవ్వి.. పైపుల ద్వారా నీరు సరఫరా అయ్యేలా చేశారు. రసాయన రహితంగా వ్యవసాయాన్ని సాగిస్తున్నారు. ఆయనను కన్నడిగులు వన్ మ్యాన్ ఆర్మీగా పిలుస్తారు. నాయక్కు పద్మశ్రీ అవార్డు లభించడం పలువురు హర్షం వ్యక్తం చేస్తోన్నారు.