'కోహినూర్ వజ్రంపై భారత్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం'
లండన్: ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల్లో ఒకటైన కోహినూర్ వజ్రంపై భారత్ నిర్ణయాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ (లండన్ చట్ట సభ) స్వాగతించింది. బ్రిటీష్ రాణి మకుటాన్ని అలంకరించిన కోహినూర్ వజ్రం చోరీ సొత్తు కిందకు రానే రాదని భారత్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడు కీత్ వజ్ మాట్లాడుతూ.. 108క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని బ్రిటీష్ రాణి కాలం నాటి సిక్కు పాలకులు సైనిక సాయానికి కృతజ్ఞతగా బ్రిటీష్ సింహాసనానికి కానుకగా సమర్పించుకున్నామని సుప్రీం కోర్టుకు నివేదించడాన్ని గౌరవిస్తున్నట్టు చెప్పారు.
కాగా, ప్రపంచంలోనే అరుదైన మన దేశానికి కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్కు బహుమతిగా ఇచ్చారని, దాన్ని వెనక్కి తెచ్చేదిలేదని సంకేతాలు అందించిన కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకున్న విషయం తెలిసిందే. అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి తెచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
తమ ఉద్దేశాలను న్యాయస్థానానికి ఇంకా తెలియ జేయలేదని.. మీడియాలో తప్పుడు కథనాలొచ్చాయని.. తెలిపింది. ఈమేరకు సాంస్క్తృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాల ఆధారంగా ఆ కథనాలు లేవని పేర్కొంది. విషయం కోర్టు పరిధిలో ఉందని, సొలిసిటర్ జనరల్ కోహినూర్ వజ్రం చరిత్ర గురించి న్యాయస్థానానికి విన్నవించారని పేర్కొంది.
ఇంకా ప్రభుత్వ ఉద్దేశాలేవీ తెలియజేయలేదని వివరించింది. కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ పాలకులు ఎత్తుకెళ్లలేదని, అలాగే బలవంతంగా తీసుకెళ్లలేదని నాటి పంజాబ్ పాలకులే దాన్ని ఈస్టిఇండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చారని సుప్రీం కోర్టులో సోమవారం ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది.
'కోహినూర్ వజ్రాన్ని బలవంతంగా ఎత్తుకు పోయారని.. లేదా చోరీకి గురైందని చెప్పలేమని, సిక్కు యుద్ధాల్లో సహకారం అందించినందుకు గాను 1849లో మహారాజా రంజిత్సింగ్ వారసులు ఈస్ట్ ఇండియా కంపెనీకి అందజేసినట్లు' సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు నివేదించిన ఒక రోజు తర్వాత ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. న్యాయస్థానం 6 వారాల గడువు ఇచ్చిన సంగతిని ప్రకటనలో ప్రభుత్వం ప్రస్తావించింది.