గవర్నర్గా నా నియామకంపై వివాదం లేదు: సదాశివం
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నియమితులయ్యారు. కేరళ గవర్నర్గా ఉన్న షీలాదీక్షిత్ రాజీనామాతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
కేరళ గవర్నర్గా నియమితులైన తర్వాత పి సదాశివం మాట్లాడుతూ తనను నిమించడం పట్ల ఎటువంటి వివాదం లేదని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పళనిస్వామి సదాశివం అన్నారు. తాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నియామకం జరిగిఉంటే ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిఉండేదని, కానీ తాను పదవీవిరమణ చేసి నాలుగు నెలలు గడిచినందునా వివాదం లేదని ఆయన వివరించారు.
తాను ఎటువంటి వ్యాపారాలు చేయబోనని, కార్పోరేట్ సంస్దలకు సలహాలు అందించబోనని పదవీ విరమణ రోజే చెప్పానని అన్నారు. కేరళ గవర్నర్గా పి సదాశివంను కేంద్ర ప్రభుత్వం నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ, కేరళ ప్రభుత్వం తప్పుబట్టిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.
గవర్నర్గా జస్టిస్ సదాశివం నియమించాలన్న ప్రతిపాదనలు వెలువడినప్పటి నుండి ఈ అంశం రాజకీయ, న్యాయ రంగాల్లో చర్చనీయాంశమైంది. గతంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి గవర్నర్ పదవి చేపట్టలేదని మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి వీఎన్ ఖరే అన్నారు. తనకే ఇలాంటి అవకాశం ఇస్తే తాను స్వీకరించేవాడిని కానని ఆయన ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు.