ముంబైకి తిరిగిరండి.. నాతో మాట్లాడండి: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ థాక్రే పిలుపు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మరో రెండు రోజుల్లో కీలక దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. గౌహతిలో సుమారు 55 మందికిపైగా ఎమ్మెల్యేలతో శివసేన రెబల్ నేత ఏక్నాథ్ క్యాంపు పెట్టిన విషయం తెలిసిందే. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఇతర నేతలు వారిని తిరిగిరప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ.. సఫలం కాలేదు. దీంతో తాజాగా, ఉద్ధవ్ థాక్రే కీలక ప్రతిపాదన చేశారు.
ముంబైకి రండి.. నన్ను కలవండి: రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్ధవ్
గౌహతిలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలంతా తిరిగి ముంబైకి రావాలని, తనతో మాట్లాడాలని శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పిలుపునిచ్చారు. మీలో కొంతమంది ఇప్పటికీ నాతో టచ్ లో ఉన్నారు. మీరంతా ఇప్పటికీ శివసేనలోనే ఉన్నారు. నన్ను కలిసి నాతో మీ అభిప్రాయాలను పంచుకోండి అని ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. మీ భావోద్వేగాలను అర్థం చేసుకుంటానని చెప్పారు.
కుటుంబ పెద్దగా ఉంటానంటూ రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ పిలుపు
ఇప్పటికీ సమయమేమీ మించిపోలేదు. ముంబైకి తిరిగివచ్చి నాతో కూర్చుని మాట్లాడండి. అభిప్రాయ భేదాలు, ఇతర అనుమానాలపై స్పష్టత వచ్చేలా చర్చించుకుందాం. అపోహలను తొలగించుకుందాం అని రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. మీరు వచ్చి నన్ను కలిస్తే ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా మీకు సంబంధించిన విషయంలో జాగ్రత్త తీసుకుంటాను అని ఉద్ధవ్ థాక్రే రెబల్ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు.
ముంబైకి ఏక్నాథ్ షిండే.. గవర్నర్ను కలిసే అవకాశం
కాగా, తాను ముంబైకి వస్తున్నట్లు రెబల్ శివసేన నేత ఏక్నాథ్ షిండే మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. హిందుత్వం కోసమే తనవెంట 50 మంది ఎమ్మెల్యేలు వచ్చారని చెప్పారు. తన గ్రూపులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు ఉద్ధవ్ థాక్రేతో కాంటాక్టులో ఉన్నారో చెప్పాలని షిండే డిమాండ్ చేశారు. 15-16 మంది రెబల్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని సోమవారం ఆదిత్య థాక్రే వ్యాఖ్యానించారు.
గౌహతి క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల్లోనే రెండు గ్రూపులున్నాయని తెలిపారు. వారంతా గౌహతికి పారిపోయారన్నారు. ఈ నేపథ్యంలో షిండే ఈ మేరకు స్పందించారు.తన వద్ద 55 మంది ఎమ్మెల్యేలున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వం మెజార్టీని కోల్పోయిందని షిండే అన్నారు. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మహారాష్ట్ర గవర్నర్ను కలిసి స్పష్టం చేయనున్నారు షిండే.