petrol: బీజేపీ మంత్రి పిలుపు -సైకిళ్లు వాడండయ్యా.. ఆరోగ్యానికి కూడా మంచిది..
దేశంలో కరోనా విలయానికి తోడు ఇంధన భగభగలు సామాన్యుణ్ని కాల్చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలతో నిమిత్తం లేకుండా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని ఎడాపెడా పెంచేస్తున్నాయి కంపెనీలు. పెట్రో ధరల పెరుగుదలపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ ఇప్పుడు ప్రజలకు ఉచిత సలహాలూ ఇస్తున్నది..
పెట్రోల్ ధరలు మండిపోతుండగా, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ప్రజలకు ఓ పరిష్కార మార్గం చూపించారు. రాష్ట్ర రాజధాని భోపాల్లో మంగళవారం లీటర్ పెట్రోల్ రూ 107 దాటడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ అనూహ్య సమాధానాలు చెప్పారు. పెట్రోల్, డీజిల్ రేటు పెరిగిన దరిమిలా ప్రజలంతా మోటారు వాహనాలకు బదులు సైకిళ్లు వాడాలని ఆయన సూచించారు.

పెట్రోల్ వాడకం తగ్గించుకునేలా ప్రజలు చిన్న చిన్న పనులకు, అంటే, కూరగాయల మార్కెట్కు వెళ్లడం లాంటి పనులకు సైకిల్ను వాడలేమా? సైకిళ్లు వాడటం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు కాలుష్యాన్ని నివారించినవాళ్లమవుతామని మంత్రి వ్యాఖ్యానించారు. అంతేకాదు,
దేశంలో ఇంధన ధరలు అధికంగా ఉన్నమాట వాస్తవమేనని, వీటి ద్వారా సమకూరిన నిధులను పేదల సంక్షేమానికి వెచ్చిస్తున్నారని మంత్రి ప్రద్యుమన్ తోమర్ అన్నారు. ఆరోగ్య పధకాల కంటే పెట్రోల్, డీజిల్ ధరలు ముఖ్యమా అని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం నియంత్రిస్తుందని, రాష్ట్రాలకు సంబంధం లేదని అన్నారు. ఇదిలా ఉంటే,
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 37 పైసలు, డీజిల్పై 30పైసలు పెరిగింది. సవరించిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.98.81, డీజిల్ రూ.89.13కి చేరింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, మణిపూర్, జమ్మూకశ్మీర్, లదాక్ లో లీటర్ పెట్రోల్ ఇప్పటికే వంద మార్కును దాటింది.












Click it and Unblock the Notifications