విజయ్ ఎలా సాల్వ్ చేస్తాడో గానీ..: చిలికి చిలికి గాలివాన
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే కూటమిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా విభేదాలు రచ్చకెక్కాయి. 2029 నాటి లోక్సభ ఎన్నికల్లో విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై టీవీకే, దాని భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ మధ్య ఘర్షణపూరక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీనన టీవీకే తన మిత్రపక్షాలతో సమావేశం కానుంది.
విజయ్ను 2029 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటూ టీవీకే నేతలు చేస్తున్న డిమాండ్లు ఈ వివాదానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలోనే సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే పార్టీను ఈ నెల 9వ తేదీ నాటి సమావేశానికి ఆహ్వానించారు టీవీకే నేతలు. కూటమిలో అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్కు ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ వివాదం టీవీకే శాసనసభ్యురాలు కనిమొళి చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. రాబోయే ఎన్నికల్లో విజయ్ ప్రధాని అభ్యర్థి అవుతారని, ఢిల్లీ కాకుండా తమిళనాడు మాత్రమే ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తుందని ఆమె ఇటీవలే ప్రకటించారు. రాహుల్ గాంధీ సైతం భవిష్యత్తులో విజయ్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు. మంత్రి నిర్మల్ కుమార్, ఎమ్మెల్యే తాహిరా, ఇతర పార్టీ నేతలు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
టీవీకే నేతల వ్యాఖ్యలను మిత్రపక్షం కాంగ్రెస్ విభేదించింది. వాటిని తోసిపుచ్చింది. 2029లోనూ రాహుల్ గాంధీనే తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని స్పష్టం చేసింది. కొందరు కొత్తగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేలు ఇంకా విజయ్ అభిమాన సంఘం ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారగై కుత్బర్ట్ ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును గతంలో స్వయంగా విజయ్ సైతం అంగీకరించారని ఆమె గుర్తు చేశారు.
అటు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ కూడా ఈ పరిణామాలపై స్పందించారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికే టీవీకే నేతలు ఇలాంటి అసంబద్ధ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ప్రధాని అభ్యర్థిత్వం అనేది ప్రజల చేతుల్లో ఉందని ఆయన తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. టీవీకే మాత్రం పెద్దగా వెనక్కి తగ్గినట్లు కనిపించట్లేదు. దీంతో టీవీకే- కాంగ్రెస్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.
దీన్ని పరిష్కరించడానికి టీవీకే ఈ నెల 9వ తేదీన మిత్రపక్షాలతో సమావేశం కానుంది. దీనికి కాంగ్రెస్ కు ఆహ్వానం లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే తో పాటు టీవీకేకు బయటి నుంచి కూడా మద్దతు ఇస్తోన్న పార్టీలనే పిలిపించారు విజయ్. కాంగ్రెస్ తో తలెత్తిన ఈ విభేదాలు ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వం మనుగడ సాగించాలంటే కాంగ్రెస్తో పాటు వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ వివాదాన్ని విజయ్ ఎలా పరిష్కరిస్తాడనేది చర్చనీయాంశమౌతోంది.















Click it and Unblock the Notifications