ఉద్యోగం ఇప్పిస్తామని పిలిచి.. బట్టలూడదీసి చిత్రహింసలు!
సాధారణంగా ప్రైవేట్ ఫైనాన్షియల్ యాప్స్ లేదా వడ్డీ వ్యాపారులు అప్పులు తిరిగి చెల్లించని వారిపై బెదిరింపులకు దిగడం లేదా వేధించడం వంటి ఘటనలు వింటూ ఉంటాం. కానీ కర్ణాటక రాజధాని బెంగళూరులో అంతకుమించి అత్యంత హేయమైన, క్రూరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు, వడ్డీ డబ్బులు తిరిగి చెల్లించలేదనే నెపంతో ఓ మహిళను కిడ్నాప్ చేసి, బట్టలు ఊడదీసి చిత్రహింసలకు గురిచేసి, ఆ దృశ్యాలను వీడియో తీసిన దారుణం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు సుమారు రెండేళ్ల క్రితం నిందితురాలైన రేష్మా బాను వద్ద రూ.1,00,000 అప్పుగా తీసుకుంది. ఆ తర్వాత రేష్మా ద్వారానే నజాత్ అనే మరో వ్యక్తి నుంచి అదనంగా మరో రూ.50 వేలను అప్పుగా పొందింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మహిళ గత ఆరు నెలలుగా వడ్డీ, గత రెండు నెలలుగా అసలు వాయిదాలు చెల్లించలేకపోయింది. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె రేష్మా ఫోన్ నంబర్ను బ్లాక్ చేసి తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది.

ఉద్యోగం ఎరవేసి కిడ్నాప్
ఈ క్రమంలో బాధితురాలిని కిడ్నాప్ చేసేందుకు నిందితులు కుట్ర పన్నారు. నజాత్ అనే వ్యక్తి ఆ మహిళకు ఫోన్ చేసి, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన ఇంటికి పిలిపించాడు. ఆమె అక్కడికి చేరుకోగానే రేష్మా, ఆమె భర్త సుహైల్ కూడా అక్కడికి వచ్చారు. ముగ్గురూ కలిసి ఆమెపై కత్తితో దాడి చేసి, బలవంతంగా ఓ ఆటోరిక్షాలో ఎక్కించి అపహరించారు. అనంతరం కుంబల్గోడు సమీపంలోని ఓ ఇంటికి తరలించి బందీగా ఉంచారు.
చిత్రహింసలు, వీడియో చిత్రీకరణ
బంధించిన ఆ ఇంటి వద్ద ముగ్గురు నిందితులు కలిసి ఆ మహిళను తీవ్రంగా కొట్టి హింసించారు. ఆపై ఆమెను వివస్త్రను చేసి వీడియో చిత్రీకరించారు. అప్పుగా తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగారు.
నిందితుల అరెస్ట్
మరోవైపు కూతురు కనిపించకపోవడంతో బాధితురాలి తల్లి చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాధితురాలు కుంబల్గోడులోని ఓ ఇంట్లో బందీగా ఉన్నట్లు గుర్తించి ఆమెను సురక్షితంగా రక్షించారు. ఈ దారుణానికి పాల్పడిన రేష్మా బాను, నజాత్, సుహైల్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్ర లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













Click it and Unblock the Notifications