చేతులెత్తేసిన ఫ్రీడమ్ 251! లాభం 30, ఎవరీ గోయల్?
న్యూఢిల్లీ: ఫ్రీడమ్ 251తో ముందుకు వచ్చిన రింగింగ్ బెల్స్ శనివారం నాడు చేతులెత్తేసింది! ప్రపంచంలోనే అతిచవకైన స్మార్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251 కొనుగోలుకు జనం వెల్లువెత్తారు. అనుమానాలను, సందేహాలను పక్కన పెట్టి... మూడు రోజుల్లోనే ఏకంగా 7.35 కోట్ల మంది బుక్ చేసుకున్నారు.
శనివారం ఉదయం 11 గంటల వరకు 7.35 కోట్ల ఫోన్లకు ఆన్లైన్లో ఆర్డర్లు వచ్చాయి. బుకింగ్కు ఆదివారం వరకు గడువు ఉన్నా తమ అంచనాలకు మించి ఆర్డర్లు రావడంతో శనివారం మధ్యాహ్నం నుంచి రింగింగ్ బెల్స్ కంపెనీ ఆర్డర్లను నిలిపివేసింది.
అధిక స్థాయిలో డిమాండ్ రావడంతో ఫ్రీడమ్ 251 బుకింగ్లను కంపెనీ నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 'ఫ్రీడమ్ 251కు వచ్చిన స్పందనకు మా కృతజ్ఞతలు. మా అంచనాలకు మించి డిమాండ్ రావడంతో ఫేజ్ 1 బుకింగ్లను నిలిపివేస్తున్నామ'ని రింగింగ్ బెల్స్ వెల్లడించింది.
అందరి అవసరాలను మేం ఇప్పుడు తీర్చలేకపోవచ్చునని, వచ్చే దశలో సేవలను అందించేందుకు కృషి చేస్తామని కంపెనీ వెబ్సైట్లో పేర్కొంది. మొదటి రోజు 3.70 కోట్లు, రెండో రోజు శుక్రవారం 2.47 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయని కంపెనీ తెలిపింది. మొత్తంగా 7 కోట్లకు పైగా బుక్ అయ్యాయి.
ఐటీ, ఎక్సైజ్ శాఖ దృష్టి
రూ.251కే స్మార్ట్ ఫోన్ను అందిస్తామని ప్రకటించిన రింగింగ్ బెల్స్ సంస్థపై ఎక్సైజ్, ఐటీ శాఖలు దృష్టి పెట్టాయి. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ ఆర్థిక నమూనాపై ఐటీ శాఖ దృష్టిపెట్టినట్లు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) నుంచి పత్రాలను కూడా సంపాదించినట్లుగా తెలుస్తోంది.
ఎక్సైజ్, ఐటీ శాఖలు తమ కార్యాలయాన్ని సందర్శించాయని, భారత్లో తయారీ, నైపుణ్య భారత్, అంకుర భారత్ కింద మైలురాయిలను సాధించాలన్నది మా ప్రణాళిక అని, కంపెనీ భవిష్యత్ కోసం వారు కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారని, పూర్తి మద్దతు కూడా ప్రకటించారని రింగింగ్ బెల్స్ అధ్యక్షుడు అశోక్ చద్దా తెలిపారు.
రూ.251 స్మార్ట్ఫోన్ పథకంపై విచారణ జరిపించాల్సిందిగా ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అరుణా శర్మను టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. అవసరమైతే రాష్ట్రాల సహకారం తీసుకోవాల్సిందిగా సూచించారని తెలుస్తోంది.
'నా ఖర్చు రూ.220 మాత్రమే'
రూ.251 స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించినప్పటి నుంచి కంపెనీపై అనేక వివాదాలు, సందేహాలు ముసురుకున్న విషయం తెలిసిందే. దీనిపై రింగింగ్ బెల్స్ యజమాని గోయల్ స్పందించారు.
నిజం చెప్పాలంటే రూ.251 ఖరీదైన ఓ స్మార్ట్ ఫోన్ తయారీకు తనకు రూ.220 ఖర్చు మాత్రమే అవుతుందని, దీని మార్కెట్ ధర రూ.1,719 అని, కానీ లాభార్జన తన అభిమతం కాదని, ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ ఇండియా కార్యక్రమానికి నా వంతు తోడ్పడాలన్న ఉద్దేశ్యంతో రూ.251కి విక్రయించాలని నిర్ణయించానని, నా వివరణతో ఐటీ శాఖ సంతృప్తి చెందిందని గోయల్ చెప్పారు.
ఇదిలా ఉండగా, అతి చౌకైన స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్పిన మోహిత్ గోయల్ తండ్రి రాజేష్ గోయల్ ఓ కిరాణా కొట్టు యజమాని. ఉత్తర ప్రదేశ్లోని షామ్లి జిల్లా గుర్హిపుఖ్తాలో ఇప్పటికే ఆయన దుకాణం నడుపుతున్నారు. పేదలకు సేవ చేయాలన్నది తన కుమారుడి ఆకాంక్ష అని, కచ్చితంగా చౌక ధరకు స్మార్ట్ ఫోన్లు అందిస్తాడని రాజేష్ ధీమా వ్యక్తం చేశారు.