అమ్మ జయలలిత ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు: హై కోర్టు డెడ్ లైన్, పండగల సమయం, రెఢీ !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ మద్రాసు హై కోర్టు ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ మద్రాసు హై కోర్టు ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానంతో మద్రాసు హై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
2017 డిసెంబర్ 31వ తేదీ లోపు చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికలు నిర్వహించాలని మంగళవారం (నవంబర్ 21)వ తేదీన మద్రాసు హై కోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. 2016 డిసెంబర్ 5వ తేదీన జయలలిత అపోలో ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈ ఏడాది మొదట్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం సందర్బంగా టీటీవీ దినకరన్ వర్గీయులు కోట్ల రూపాయుల నగదు, విలువైన వస్తువులు ఓటర్లకు పంచిపెట్టారని ఆరోపణలు రావడంతో ఉప ఎన్నికలు రద్దు చేశారు.
తరువాత మద్రాసు హై కోర్టు డిసెంబర్ 31వ తేదీ లోపు ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు పూర్తి చెయ్యాలని ఎన్నికల సంఘానికి సూచించింది. మంగళవారం మద్రాసు హై కోర్టులో పిటిషన్ విచారణకు వచ్చింది. క్రిస్ మస్, సంక్రాంతి పండగల సందర్బంలో ఆర్ కే నగర్ ఉప ఎన్ననికలు నిర్వహిస్తే పోటీ చేసే అభ్యర్థులు భారీ మొత్తంలో ఓటర్లకు నగదు, ఖరీదైన వస్తువులు ఆశ చూపే అవకాశం ఉందని ఎన్నికల సంఘం కోర్టులో చెప్పింది. ఈ విషయంపై మద్రాసు హై కోర్టు స్పంధిస్తూ కట్టుదిట్టమైన భద్రతతో ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు డిసెంబర్ 31వ తేదీలోపు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.