ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు, నామినేషన్ లు దాఖలు, పగటి కలలు కంటున్నారు !
చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ శుక్రవారం నామినేషన్ వేశారు. తమిళనాడు మత్స్యశాఖ మంత్రి జయకుమార్ తదితరులు మధుసూదనన్ వెంట వచ్చారు. టీటీవీ దినకరన్ పగటి కలలు కంటున్నారని మంత్రి జయకుమార్ ఎద్దేవ చేశారు.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గానికి ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. హనుమజయంతి సందర్బంగా శుక్రవారం మధుసూదనన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన మధుసూదనన్ అమ్మ పాలన అందించడానికే ఇక్కడి ప్రజలు తమకే ఓటు వేస్తారని అన్నారు.
మంత్రి జయకుమార్ మాట్లాడుతూ టీటీవీ దినకరన్ తమిళనాడుకు ఓ చీడపురుగులా తగులుకున్నాడని ఆరోపించారు. టీటీవీ దినకరన్ కు ఓట్లు వేసి తమ ఓటు హక్కు దుర్వినియోగం చేసుకోవడానికి ఆర్ కే నగర్ ప్రజలు సిద్దంగా లేరని, విజయం మధుసూదనన్ దే అంటూ మంత్రి జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు.
శనివారం నుంచి ఆర్ కే నగర్ లో ఎన్నికల ప్రచారం చేస్తామని, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్నికల ప్రచారం చేస్తారని మంత్రి జయకుమార్ చెప్పారు. టీటీవీ దినకరన్ సైతం శుక్రవారం అట్టహాసంగా తన అనుచరులతో కలిసి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నామినేషన్ వేశారు.