చేతులెత్తి మొక్కినా:'ప్రమాదం' వివాదంలో స్మృతిఇరానీ
న్యూఢిల్లీ: శనివారం రాత్రి యమునా ఎక్స్ప్రెస్ వేపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వైద్యుడి కుమార్తె... స్మృతీపై సంచలన ఆరోపణలు చేసింది.
ప్రమాదం అనంతరం స్మృతి కారు దిగి బయటకు వచ్చారని, రక్తం కారుతున్న స్థితిలో తాను చేతులు జోడించి తాము ఆసుపత్రికి వెళ్లేందుకు సహకరించాలని వేడుకుంటే ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. స్మృతీ అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపించింది.
తన సోదరి సైతం బతిమిలాడినా ఆమె మనసు కరగలేదని మృతుడి కుమారుడు తెలిపాడు. దీంతో తాజాగా, కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటనలో స్మృతి కొత్త వివాదంలో చిక్కుకున్నట్లయింది.
ప్రమాదం జరిగిన తర్వాత వైద్య సహాయం అందించడానికి మంత్రి ముందుకు రాలేరని, తన తండ్రి రమేశ్తో పాటు బంధువైన మరో అమ్మాయితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతున్నప్పుడు మంత్రి స్మృతి ఇరానీ కారు వెనక నుంచి ఢీకొందని మృతుడి కూతురు తెలిపింది.
మంత్రి సహాయం చేసి ఉంటే తన తండ్రి ప్రాణాలతో ఉండేవారని తెలిపింది. తన తండ్రి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడివున్నా.. పిల్లలు సహాయం కోసం అర్థిస్తున్నా మంత్రి స్మృతి ఇరానీ చూసి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె సోదరుడు ఆరోపించాడు.
అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. తాజా వివాదం నేపథ్యంలో మంత్రి కార్యాలయం స్పందించింది. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని మధుర ఎస్ఎస్పీని మంత్రి స్మృతి ఆదేశించారని ప్రకటించింది. మరోవైపు మంత్రి కారు వల్ల ప్రమాదం జరగలేదని మథుర ఎస్ఎస్పీ రాకేష్ సింగ్ తెలిపారు.