సంచలనం: 'బోషాణం' బయటపడ్డ ఇంటిని దోచేశారు, కన్నడ నటుడి అల్లుడి ఇల్లు గుల్ల!
కన్నడ నటుడు దొడ్డన్న అల్లుడు వీరేంద్ర ఇంట్లో చోరీ జరిగింది.
బెంగళూరు: ఇటీవల ఐటీ సోదాల్లో బాత్రూమ్లో బోషాణం బయటపడటంతో జేడీఎస్ నాయకుడు, నటుడు దొడ్డణ్ణ అల్లుడు వీరేంద్ర అలియాస్ పప్పి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. తాజాగా ఆయన ఇంట్లో జరిగిన భారీ చోరీ సంచలనం రేకెత్తిస్తోంది. ఈ చోరీలో దాదాపు 21కేజీల బంగారు బిస్కెట్లు మాయమైనట్లు తెలుస్తోంది.

ఆలస్యంగా
సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ఆరోజు ఇంటివద్ద ఎవరూ లేకపోవడంతో దొంగలు తాళం పగలగొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఉన్న బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 21 కిలోల బంగారు బిస్కెట్లను చోరీ చేసినట్లుగా చెప్పారు.

వాటి విలువ రూ.6కోట్ల పైమాటే:
చోరీకి గురైన బంగారు బిస్కెట్ల విలువ సుమారు రూ.6.30 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. అదే రోజు రాత్రి వీరేంద్ర ఇంటికి సమీపంలోనే ఉన్న ఆయన సోదరుడు తిప్పేస్వామి ఇంట్లోను చోరీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. తిప్పేస్వామి ఇంట్లో నుంచి రూ.10.70లక్షలు చోరీకి గురైనట్లుగా గుర్తించారు.

అదుపులో ఇద్దరు:
చోరీ గురించి సమాచారం తెలియగానే డాగ్స్క్వాడ్తో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిపుణులు వేలిముద్రలు సేకరించారు. ఆ రెండు ఇళ్లకు చెందిన ఇద్దరు పనిమనుషులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం 'బోషాణం':
కొద్ది రోజుల క్రితం వీరేంద్ర ఇంట్లో జరిగిన ఐటీ సోదాల్లో భారీ బోషాణం బయటపడింది. మూడో కంటికి తెలియకుండా, ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూమ్ లోనే ఆయన బోషాణం ఏర్పాటు చేశారు. పైకి మాత్రం టైల్స్ కప్పి పెట్టి గోడ లాగే కనిపించేట్లు చేశారు. అయితే ఈ టైల్స్ లో చీపురు పుల్ల పట్టేంత ఓ చిన్న రంధ్రం అధికారుల కంట పడటంతో బోషాణం బయటపడింది. అందులో తాళం చెవి పెట్టి తిప్పగానే బోషాణం తెరుచుకుంది.












Click it and Unblock the Notifications