సెక్యూరిటీ గార్డుపై దాడి: ఏటిఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు!
మోగా: నిన్న మొన్నటి వరకు ఏటిఎంలలో డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇప్పుడు ఏకంగా ఏటిఎం యంత్రాలనే ఎత్తుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని మోగా-ఫిరోజపూర్ రోడ్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వరంగ బ్యాంక్ ఏటిఎం కేంద్రంలోని ఏటిఎం యంత్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది.
ఏటిఎం సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన ఆరుగురు దుండుగులు, అతని కళ్లల్లో ఏదో రసాయనాన్ని చల్లారు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించిన దొంగలు ఆ ఏటిఎం యంత్రాన్ని బయటికి తరలించారు. ఓ నాలుగు చక్రాల వాహనంలో ఆ ఏటిఎంను ఎత్తుకెళ్లారు.
దొంగతనానికి గురైన ఆ ఏటిఎం యంత్రంలో రూ. 1,70,600 ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, రసాయనం కళ్లల్లో కొట్టడంతో ఆ ఏటిఎం సెక్యూరిటీ గార్డు కళ్లు పాక్షికంగా కనబడటం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు.